కేతన్ పరేఖ్ మరో స్కామ్
ABN, Publish Date - Jan 03 , 2025 | 05:28 AM
భారత స్టాక్ మార్కెట్లో భారీ అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపించే పేర్లు హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్. డాట్ కామ్ బూమ్ (1999-2000) సమయంలో మార్కెట్ను శాసించిన కేతన్ పరేఖ్....
ఫ్రంట్ రన్నింగ్ స్కీమ్ ద్వారా రూ.65.77 కోట్ల అక్రమార్జన
ఆయనతో సహా ముగ్గురిపై నిషేధం విధించిన సెబీ
న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లో భారీ అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపించే పేర్లు హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్. డాట్ కామ్ బూమ్ (1999-2000) సమయంలో మార్కెట్ను శాసించిన కేతన్ పరేఖ్.. పలు ఆర్థిక మోసాలకు పాల్పడి జైలుకెళ్లడంతో పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 14 ఏళ్ల పాటు నిషేధించబడ్డారు. అయినా, ఆయన తీరు మారలేదు. ఈ మార్కెట్ మాయావి మరో కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫ్రంట్ రన్నింగ్ స్కీమ్ ద్వారా రూ.65.77 కోట్లు అక్రమంగా ఆర్జించిన కేసులో కేతన్ పరేఖ్ సహా ముగ్గురు వ్యక్తులను సెబీ తక్షణమే సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించింది. సింగపూర్కు చెందిన ట్రేడర్ రోహిత్ సాల్గావ్కర్, అశోక్ కుమార్ పొద్దార్ కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నారు. అలాగే, ఈ ముగ్గురు ఇకపై ఏ మార్కెట్ ఇంటర్మీడియేటరీ సంస్థతో ప్రత్యక్షం లేదా ప్రత్యక్షంగా అనుబంధం కాకుండా నిషేధించింది. అంతేకాదు, తాజా స్కామ్లో అక్రమంగా ఆర్జించిన మొత్తం సొమ్మును కక్కాలని పరేఖ్ సహా 22 సంస్థలు, వ్యక్తులను ఆదేశిస్తూ సెబీ షోకాజు నోటీసులు జారీ చేసింది. వీరి బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే జప్తు చేసింది. ఏదైనా బడా పెట్టుబడి సంస్థ ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టబోతున్నారనే సమాచారాన్ని బ్రోకర్ లేదా ఎవరైనా మార్కెట్ అనలిస్ట్ ద్వారా ముందస్తుగా తెలుసుకుని,
ఆ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అయాచితంగా లబ్ది పొందడాన్నే ఫ్రంట్ రన్నింగ్ కార్యకలాపాలుగా పిలుస్తారు. కేతన్ పరేఖ్ కూడా ఇదే వ్యవహారానికి పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులను నిర్వహిస్తోన్న ఓ అమెరికన్ ఎఫ్పీఐ (ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్).. భారత కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా తెలుసుకుని వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్రమంగా లబ్దిపొందారు. ఈ ఎఫ్పీఐతో సత్సంబంధాలున్న రోహిత్ సాల్గావ్కర్ ద్వారా పెట్టుబడుల సమాచారాన్ని తెలుసుకుని, పరేఖ్ ఇతరుల ద్వారా ట్రేడింగ్కు పాల్పడినట్లు.. 2021 జనవరి నుంచి 2023 జూన్ వరకు ఈ తతంగం నడిచినట్లు సెబీ గుర్తించింది.
Updated Date - Jan 03 , 2025 | 05:28 AM