‘గో ఫస్ట్’ ఇక తెర మరుగు
ABN, Publish Date - Jan 21 , 2025 | 06:21 AM
ఆర్థిక ఇక్కట్లతో రెండేళ్ల క్రితం విమాన సర్వీసులు నిలిపివేసిన గో ఫస్ట్ విమానయాన సంస్థపై దివాలా ప్రక్రియ చేపట్టాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం ఆదేశించింది....
లిక్విడేషన్కు ఎన్సీఎల్టీ ఆదేశం
న్యూఢిల్లీ: ఆర్థిక ఇక్కట్లతో రెండేళ్ల క్రితం విమాన సర్వీసులు నిలిపివేసిన గో ఫస్ట్ విమానయాన సంస్థపై దివాలా ప్రక్రియ చేపట్టాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం ఆదేశించింది. 2023 మే నెలలో గో ఫస్ట్ విమానయాన సంస్థ స్వచ్ఛందంగా దివాలా దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ డెటార్ గో ఎయిర్ (ఇండియా) లిమిటెడ్ దివాలా ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా రుణదాతల కమిటీని (సీఓసీ) ఆదేశిస్తున్నట్టు ఎన్సీఎల్టీ సోమవారం నాడు జారీ చేసిన 15 పేజీల ఉత్తర్వులో తెలిపింది. కార్పొరేట్ డెటార్ను లిక్విడేట్ చేసే హక్కు చట్టపరమైన ఈ స్కీమ్లోని రుణదాతల కమిటీకి (సీఓసీ) ఉంటుందని సోమవారం నాటి ఉత్తర్వులో ఎన్సీఎల్టీ తెలిపింది. రిజల్యూషన్ ప్లాన్ను ధ్రువీకరించడానికి ముందు, సీఓసీ ఏర్పాటైన నాటి నుంచి ఎప్పుడైనా లిక్విడేషన్ ప్రక్రియ చేపట్టే అధికారం సీఓసీదేనని తేల్చిచెప్పింది. ‘‘లిక్విడేషన్ కోసం సీఓసీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీ వంటి చట్టపరంగా ఏర్పాటైన ఏ సంస్థకు లేదు. పైగా కార్పొరేట్ డెటార్ను లిక్విడేట్ చేయాలన్న తీర్మానాన్ని సీఓసీ 100 శాతం ఓటింగ్తో ఆమోదించింది. సీఓసీకి గల వాణిజ్యపరమైన అధికారాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఎన్సీఎల్టీకి లేదు’’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2019 ఏప్రిల్లో విమాన సర్వీసులు నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ లిక్విడేషన్కు గత ఏడాది నవంబరు 7వ తేదీన సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన రెండు నెలల వ్యవధిలోనే గో ఎయిర్ లిక్విడేషన్ ఉత్తర్వులు వెలువడడం విశేషం. ఒకప్పుడు గో ఎయిర్గా ఉండి 17 ఏళ్లకు పైగా విమాన సర్వీసులు నడిపిన సంస్థను 2023 మే 3వ తేదీన సంస్థను గో ఫస్ట్గా రీ బ్రాండింగ్ చేశారు. దినకర్ తిరువన్నదపురం వేంకటసుబ్రమణియన్ను సంస్థ లిక్విడేటర్గా నియమించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని, కార్పొరేట్ డెటార్ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తును కొనసాగించాలని లిక్విడేటర్ను ఎన్సీఎల్టీ ఆదేశించింది. లిక్విడేషన్ సమయంలో పెండింగులో ఉన్న దరఖాస్తులపై తదుపరి చర్యలు తీసుకోవడంతో పాటు చట్టానికి అనుగుణంగా కార్పొరేట్ డెటార్ నుంచి బకాయిల రికవరీకి కూడా చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Updated Date - Jan 21 , 2025 | 06:21 AM