చేలల్లో డ్రోన్
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:54 AM
వ్యవసాయంలో శ్రమ, కాలయాపన, ఖర్చు తగ్గించేందుకు యంత్రాలు దోహదపడుతున్నాయి.
పురుగుమందు పిచికారీకి ఆధునిక సాంకేతికత
రైతులకు ఖర్చు.. సమయం ఆదా
తణుకు రూరల్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో శ్రమ, కాలయాపన, ఖర్చు తగ్గించేందుకు యంత్రాలు దోహదపడుతున్నాయి. వరి నాట్ల నుంచి కోత, ధాన్యం నిల్వ చేసే వరకూ సాంకేతిక పరిజ్ఞానం రైతులకు మేలు చేస్తుంది. వరిలో పురుగు మందులను పిచికారీ కి డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని పెద్ద వ్యవసాయ క్షేత్రాలకే పరిమితమైన పురుగు మందులు వెదజల్లే డ్రోన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంత పంట చేలల్లో పురుగు మందులను వెదజల్లేందుకు సిద్ధంగా వున్నాయి. ముఖ్యంగా వరి పంటపై ఆశించే చీడ, పీడల నివారణకు డ్రోన్ల వినియోగం చాలా అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో వుంచుకుని రాష్ట్ర ప్రభుత్వం లాం వ్యవసాయ పరిశోధనా స్థానంలో వరి పురుగు మందులు వెదజల్లే డ్రోన్ నిర్వహణలో యువత కు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. దీనితో పాటు ఢిల్లీ కేంద్రంగా పలు సంస్థలు వ్యవసాయంలో డ్రోన్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాయి. పురుగు మందుల పిచికారీకి డ్రోన్ యంత్రాల నిర్వహణకు సంబందించి తణుకు రూరల్ మండలం దువ్వ గ్రామంలో వ్యవసాయ శాఖ ప్రయోగాత్మకంగా నిర్వహించింది.
డ్రోన్తో ఉపయోగాలు..
విషపూరిత పురుగు మందుల పిచికారీ చేసే వ్యక్తులు రసాయన ప్రభావంతో అనారోగ్యానికి గురువుతున్నారు. ఇలా చేయడం ప్రమాదకరం కావడంతో కూలీలతో పిచికారీ చేయించడానికి ఎక్కువ ఖర్చు అవుతోంది. ఎకరాకు సుమారు 600 నుంచి 700 వరకు కూలీ చెల్లించాలి. ఒక మనిషి ఒక రోజులో రెండు, మూడు ఎకరాలు కంటె ఎక్కువ పొలంలో పురుగు మందులు స్ర్పే చేయలేరు. డ్రోన్ ద్వారా ఎకరం పంటకు మొత్తం పిచికారీ ప్రక్రియ రెండు గంటల్లో ముగుస్తుంది.
పది లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్తో గాల్లోకి..
10 లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్తో డ్రోన్ గాల్లో ఎగురుతుంది. దీనికి ఆరు బ్యాటరీలు అమర్చి ఉంటాయి. ఒక బ్యాటరీ సుమారు 2 గంటల పాటు పని చేస్తుంది. ఒక బ్యాటరీ చార్జింగ్ పూర్తి కాగానే టేక్ ల్యాండ్ చేసి మరో బ్యాటరీ అమ ర్చాలి. అలా తీసేసిన బ్యాటరీని మర లా చార్జింగ్ చేసి మరలా వినియో గించేలా రిజర్వులో ఉంచుకునే అవకాశం ఉంది. ఆరు బ్యాటరీలు సుమారు 12 గంటల పాటు ద్రోన్ తిరిగేందుకు పని చేస్తాయి. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ. 16 లక్షల వరకూ ఉంటుంది. ఇంకా తక్కువ ఖరీదులో వున్నా అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉండవు. వీటిలో నకిలీ డ్రోన్లు కూడా ఉంటాయి జాగ్రత్తగా వుండాలి.
ఎకరం 7 నిముషాల్లోనే..
డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారీ చేయడానికి ఎకరాకు 7 నిముషాల సమయం పడుతుంది.
కూలి మనుషుల ద్వారా అయితే ఒక రోజు సమయం పడుతుంది.
డ్రోన్ ద్వారా పిచికారీకి డ్రోన్ ఆపరేటర్, రైతు ఉంటే సరిపోతుంది. ఎక్కువ మంది కూలీలు అవసరం లేదు.
ఒకసారి ఒక మందు పిచికారీకి ఎకరానికి రూ.400 వరకూ ఖర్చు అవుతుంది.
రైతు, ఆపరేటర్ 2 కిలో మీటర్ల దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు.
డ్రోన్ ద్వారా పురుగు మందు పిచికారీతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు.
బీఎస్సీ ఆక్వా కల్చర్ చదివి ద్రోన్ లైసెన్ ్స తీసుకున్నా
నేను బీఎస్సీ ఆక్వా కల్చర్ చదివాను. మానాన్న మద్దూరి రాంబాబు వ్యవసాయం చేస్తారు. ఆయనకు సహాయంగా నేను, నాతో పాటు బీ కాం చదివిన నా సోదరుడు నారాయుడు కలసి ఉన్న ఊరిలోనే ఆధునిక యంత్రాలతో లాభసాటి వ్యవసాయం చేయాలనుకున్నాం. ఢిల్లీలో డ్రోన్ వెర్స్ కంపెనీలో శిక్షణ పొందాం. వరి పంటలో పురుగు మందుల పిచికారీకి సంబంధించి డ్రోన్ నిర్వహణకు 20 రోజుల శిక్షణ తీసుకున్నాం. డ్రోన్ ఫ్లైయింగ్, స్ర్పేయింగ్, డ్రోన్ టేకాఫ్, ల్యాండింగ్ వంటి అంశాలపై పూర్తిస్థాయి శిక్షణ పొంది, డ్రోన్ నిర్వహణకు సంబంధించిన లైసెన్స్ కూడా పొందాం. అనందరం రూ.16 లక్షలు వెచ్చించి డ్రోన్ కొనుగోలు చేశాం. దీనిని ఒక చోట నుంచి మరో చోటకు తరలించేందుకు బైక్ను కూడా కొనుగోలు చేసి రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించాం. సొంత బైక్ పైనే డ్రోన్ అవసరం ఉన్న చోటికి రవాణా చేయడం సులభం. దీనిని పొలాల మధ్యలో లాండింగ్ చేయడం కూడా చాలా సులభం.
–మద్దూరి లక్ష్మణ్, నారాయుడు, ద్రోన్ ఆపరేటర్లు, దువ్వ
మండలానికి ఒక డ్రోన్ ప్రతిపాదన : ఎంవీ.రమేష్, ఏడీఏ తణుకు
వరి పంటకు పురుగు మందుల పిచికారి చేసేందుకు అవసరమైన డ్రోన్లకు సంబంధించి మండలానికి ఒక యూనిట్ చొప్పున ప్రతిపాదనలు పంపించాం. రైతుమిత్ర గ్రూపుల నుంచి ఎంపిక చేసి అర్హులైన వారికి డ్రోన్ నిర్వహణపై శిక్షణ ఇచ్చేందేందుకు కూడా ప్రతిపాదనలు పంపించాం. లాంలో అన్ని రకాల పురుగు మందుల పిచికారికి సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు.
Updated Date - Feb 01 , 2025 | 12:54 AM