అమ్మా.. నువ్వు కావాలి
ABN, Publish Date - Jan 23 , 2025 | 12:04 AM
Mom.. I need you ‘మా అమ్మ మాకు కావాలి.. ఉదయం బడికి వెళ్లినప్పుడు టాటా చెప్పి పంపింది. ఇప్పుడెందుకు పలకట్లేదు..’ అంటూ అచేతనంగా ఉన్న తల్లి వద్ద పిల్లలిద్దరూ అడిగిన అమాయకపు ప్రశ్నను విన్నవారు, చూసిన వారు కంటతడి పెట్టారు.
అమ్మా.. నువ్వు కావాలి
ఉదయం టాటా చెప్పి.. ఇప్పుడెందుకు పలకవు
తల్లి మృతదేహాన్ని చూసి విలపించిన పిల్లలు
చలించిపోయిన స్థానికులు
చీపురుపల్లి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘మా అమ్మ మాకు కావాలి.. ఉదయం బడికి వెళ్లినప్పుడు టాటా చెప్పి పంపింది. ఇప్పుడెందుకు పలకట్లేదు..’ అంటూ అచేతనంగా ఉన్న తల్లి వద్ద పిల్లలిద్దరూ అడిగిన అమాయకపు ప్రశ్నను విన్నవారు, చూసిన వారు కంటతడి పెట్టారు. పట్టణంలోని రామాంజనేయకాలనీకి చెందిన వివాహిత వడ్డాది తులసి (43) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంది. తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక పిల్లలిద్దరూ భోరున విలపించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రామాంజయనేయ కాలనీకి చెందిన తులసి 2009లో క్షత్రియరామ్ సింగ్ను కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త రామ్సింగ్ ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్నారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆమె కూడా చిన్న పాన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తోంది. వీరి పేరున ప్రైవేటు ఫైనాన్స్లో రూ.5 లక్షలు, రాజాం గ్రామశక్తి సంస్థలో రూ.1.5 లక్షల రుణాలున్నాయి. ఈ నేపథ్యంలో రుణ దాతలకు సమాధానం చెప్పలేక, వడ్డీలు చెల్లించలేక తులసి తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త రామ్సింగ్ డ్యూటీలో భాగంగా బయటకు వెళ్లిపోయాక బుధవారం ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ జి.శంకరరావు సంఘటనా స్థలాన్ని సంద ర్శించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు చంద్రశేఖర్ బీంసింగ్ (7), ఇందుప్రియ (9)లను ఓదార్చడం ఎవరితరం కాలేదు. తండ్రి ఆరోగ్యం కూడా అంతంత మాత్రం కావడంతో పిల్లల భవిష్యత్తు ఎవరు తీర్చి దిద్దుతారోనని స్థానికులు ఆవేదన చెందారు.
Updated Date - Jan 23 , 2025 | 12:04 AM