prair to god హరహర మహాదేవ
ABN, Publish Date - Feb 27 , 2025 | 12:36 AM
Harahara Mahadeva మహా శివరాత్రి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినదించారు. రుద్రాభిషేకాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉపవాస దీక్షలు ఆచరించారు.
హరహర మహాదేవ
శివనామం మార్మోగిన జిల్లా
భక్తిశ్రద్ధలతో శివరాత్రి పూజలు
విజయనగరం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):
మహా శివరాత్రి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినదించారు. రుద్రాభిషేకాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉపవాస దీక్షలు ఆచరించారు. పుణ్యగిరి, రామతీర్థంలోని శివాలయాలు, ధర్మవరం సన్యాసేశ్వర ఆలయం, సారిపల్లిలోని దిబ్బేశ్వరస్వామి ఆలయం, విజయనగరం పశుపనాథేశ్వర స్వామి, రామానారాయణం తదితర ఆలయాల్లో భక్తులు బారులుతీరారు. మెంటాడ మండలం జయతి గ్రామంలో పురాతన భ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రులు, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పులకించిన పుణ్యగిరి
శృంగవరపుకోట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట పుణ్యగిరికొండ బుధవారం శివనామస్మరణతో పులకించింది. మహాశివరాత్రి కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపైకి క్యూ కట్టారు. 20వేల మంది వరకు భక్తులు ఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత దారగంగమ్మ లోయ, పుట్టదారల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. దేవిబొమ్మ కూడలి నుంచి పుణ్యగిరి కొండ వరకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది.
రామతీర్థంలో ఘనంగా శివరాత్రి జాతర
నెల్లిమర్ల, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రామతీర్థం రామ, శివ నామస్మరణలతో మార్మోగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన జాతరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం ఉదయం నుంచే రామతీర్థం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రామకోనేరులో పుణ్యస్నానాలు చేసి సీతారాములను, ఉమా సదాశివ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రానికి రామతీర్థం ప్రధాన వీధితో పాటు బోడికొండ పరిసరాలు, కళ్యాణ మండపం పరిసరాలు భక్తులతో కిక్కిరిసాయి. పూసపాటిరేగ, భోగాపురం, రణస్థలం మండలాలకు చెందిన మత్స్యకారులు రాత్రంతా ఒంటిపై నూనె రాసుకుని మధ్యలో కాగడా పెట్టి నృత్యం చేశారు.
అఖండ జ్యోతిని వెలిగించిన ఎంపీ, ఎమ్మెల్యే
బోడికొండపై బుధవారం సాయంత్రం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి అఖండ జ్యోతిని వెలిగించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు కూడా స్వామిని దర్శించుకున్నారు. ఈ తంతులో టీడీపీ సీనియర్ నాయకుడు సువ్వాడ రవిశేఖర్, మండల అధ్యక్షుడు కడగల ఆనంద్కుమార్, జిల్లా అధికార ప్రతినిఽధి గేదెల రాజారావు తదితరులు పాల్గొన్నారు.
సంగాంలో భక్తుల బారులు
వంగర, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం సంగాంలోని సంగమేశ్వరస్వామిని వేలాది మంది భక్తులు బుధవారం దర్శించుకున్నారు. వేకువజామునే వందలాదిమంది నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. ఇక్కడకు శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంతో పాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పోటెత్తారు. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో వందలాదిమంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
గంట్యాడలో పూజలు చేసిన మంత్రి
గంట్యాడ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): గంట్యాడ శివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, నాయకులు జి.శ్రీనివాసరావు, సురేష్; వెంకటరావు, ఆర్.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
నేడు అత్యధికంగా పుణ్యగిరికి..
శృంగవరపుకోట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రికి ఫుణ్యగిరి ప్రత్యేకత వేరు. శివరాత్రి రోజున వచ్చిన భక్తులకంటే నాలుగు రెట్లు అధికంగా మరుసటి రోజు కొండపై కనిపిస్తారు. ఈ ఏడాది లక్ష ఐదు వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. బుధవారం 20వేల మంది వరకు వచ్చారు. శివరాత్రి జాగరాలు చేసిన భక్తులంతా అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు పుణ్యగిరి కొండపైకి వస్తూనే ఉంటారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మెట్ల దారిలో ఇసుక పోస్తే రాలనంతగా భక్తులు నడవాల్సి వస్తుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ కేంద్రంను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడంతో ఇక్కడున్న క్రీడామైదానంలో పార్కింగ్కు అవకాశం లేకుండా పోయింది. దీంతో పోలీస్ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
Updated Date - Feb 27 , 2025 | 12:36 AM