స్వయం ఉపాధికి చేయూత
ABN, Publish Date - Feb 13 , 2025 | 01:12 AM
గడిచిన ఐదేళ్లు నిధులు, విధులు లేక కునారిల్లిన ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం జవసత్వాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించింది. ఆయా కార్పొరేషన్ల పరిధిలోని యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలని నిర్ణయించింది.
బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఈబీసీ,
తదితర కార్పొరేషన్లకు జవసత్వాలు
నిరుద్యోగ యువతకు రుణాలు
భారీగా నిధులు మంజూరు
ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో
నిలిచిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ
కోడ్ ముగిసిన అనంతరం చేపడతామంటున్న అధికారులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):
గడిచిన ఐదేళ్లు నిధులు, విధులు లేక కునారిల్లిన ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం జవసత్వాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించింది. ఆయా కార్పొరేషన్ల పరిధిలోని యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా గత నెల బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఓబీసీ విభాగాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించేందుకు గత నెల 29 నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు ఏర్పాట్లుచేశారు. అయితే, అనూహ్యంగా జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ విడుదల కావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఐదేళ్లుగా స్వయం ఉపాధి రుణాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలపై నీళ్లుచల్లినట్టయింది.
వీటికి రుణాలు..
జిల్లాలో ఆయా కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి, జనరిక్ ఔషధ దుకాణాలు, బృంద వ్యాపారాలకు రుణాలు అందించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో బ్యాంకు రుణంగా 50 శాతం, సబ్సిడీ 50 శాతం ఇవ్వనుంది. బీసీ కార్పొరేషన్కు సంబంధించి 1,615 స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు కాగా, ఇందుకుగాను రూ.30.75 కోట్లు, ఈబీసీ కార్పొరేషన్కు 36 యూనిట్లకు రూ.62 లక్షలు, కమ్మ కార్పొరేషన్లో 14 యూనిట్లకు రూ.24 లక్షలు, రెడ్డి కార్పొరేషన్కు 40 యూనిట్లకు రూ.69 లక్షలు, ఆర్య వైశ్య కార్పొరేషన్కు 17 యూనిట్లకు రూ.29 లక్షలు, క్షత్రియ కార్పొరేషన్కు 21 యూనిట్లకు రూ.36 లక్షలు, బ్రాహ్మణ కార్పొరేషన్కు 50 యూనిట్లకు రూ.86 లక్షలు, బీసీ కార్పొరేషన్ (జనరిక్ మందుల షాపు)కు 33 యూనిట్లకుగాను రూ.26.4 కోట్లు, ఈబీసీ కార్పొరేషన్లో జనరిక్ మందుల షాపులు ఆరు యూనిట్లకు రూ.48 లక్షలు, కమ్మ కార్పొరేషన్లో మూడు జనరిక్ మందుల షాపుల యూనిట్లకు రూ.24 లక్షలు, రెడ్డి కార్పొరేషన్కు ఏడు జనరిక్ మందులు షాపులకు రూ.56 లక్షలు, ఆర్యవైశ్య కార్పొరేషన్కు మూడు జనరిక్ మందులు షాపుల ఏర్పాటుకు రూ.24 లక్షలు, క్షత్రియ కార్పొరేషన్కు నాలుగు జనరిక్ మందులు షాపులకు రూ.32 లక్షలు, బ్రాహ్మణ కార్పొరేషన్కు 12 జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు రూ.96 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. అలాగే, కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చంద్రన్న స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు జిల్లాకు 452 యూనిట్లను మంజూరు చేసింది. ఇందుకు రూ.96 లక్షలు కేటాయించింది. ఆయా యూనిట్లకు సంబంధించి కేటాయించిన మొత్తంలో 50 శాతం సబ్సిడీ ఇస్తారు. మిగిలిన 50 శాతం బ్యాంకు రుణం లభిస్తుంది. మొత్తంగా ఆయా కార్పొరేషన్లకు సంబంధించి 2,313 యూనిట్లు మంజూరు కాగా, ఇందులో బ్యాంకు రుణంగా రూ.27.21 కోట్లు, సబ్సిడీ రూ.27.21 కోట్లు కలిపి మొత్తంగా రూ.54.44 కోట్ల విలువైన యూనిట్లను మంజూరు చేసింది.
కోడ్ ముగిసిన తరువాతే...
- కె.శ్రీదేవి, ఇన్చార్జి బీసీ కార్పొరేషన్ ఈడీ
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ ఆదేశాలతో వాయిదా వేశాం. కోడ్ ముగిసిన వెంటనే దరఖాస్తులను స్వీకరిస్తాం. ఆయా కార్పొరేషన్లకు చెందినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిధులు వెనక్కి వెళతాయన్న భయం లేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఆన్లైన్ బెనిఫీషియరీ మేనేజ్మెంట్ మానటరింగ్ సిస్టమ్ (ఓబీఎంఎంఎస్) ఓపెన్ అవుతుంది. అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.
Updated Date - Feb 13 , 2025 | 01:12 AM