మాకు గౌరవం ఇవ్వండి
ABN, Publish Date - Feb 21 , 2025 | 10:44 PM
స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర వారసులకు దక్కిన గౌరవం తమకు కల్పించాలని అల్లూరి సీతారామరాజు అనుచరుడు మల్లుదొర వారసులు డిమాండ్ చేశారు.
అల్లూరి అనుచరుడు మల్లుదొర వారసుల డిమాండ్
దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నామని ఆవేదన
గంటందొర వారసులతో సమానంగా గుర్తించాలని వేడుకోలు
కొయ్యూరు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర వారసులకు దక్కిన గౌరవం తమకు కల్పించాలని అల్లూరి సీతారామరాజు అనుచరుడు మల్లుదొర వారసులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకరపాడు కూడలిలో మల్లుదొర, అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం మల్లుదొర వారసులు విలేకర్లతో మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరికి గాం గంటం దొర, మల్లుదొర ప్రధాన అనుచరులన్నారు. గంటందొర వారసులకు సముచిత స్థానం కలిపిస్తున్నారని, తమను అసలు గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లుదొర అండమాన్ జైలు నుంచి వచ్చాక 1956లో గుడ్లపల్లికు చెందిన అచ్చియ్యమ్మను పెళ్లి చేసుకోగా.. వారికి కనకమ్మ అనే కూతురు పుట్టిందన్నారు. కనకమ్మకు చంద్రావతి, లక్ష్మి కుమార్తెలు పుట్టారన్నారు. చంద్రావతికు కొప్పు రాజబాబు, బాలమ్మ, లక్ష్మి సంతానం కాగా లక్ష్మికి నాగమణి, కుమారి, విజయ, కొండమ్మలు మల్లుదొర వారసులుగా ఉన్నారన్నారు. గుడ్లపల్లి, మర్రివాడగూడెం, లకారపుపేటల్లో మల్లుదొర వాసులు దీనస్థితిలో బతుకుతున్నారన్నారు. గంటందొర, మల్లుదొర ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించినపుడు కేవలం గంటందొర వారసులనే గౌరవించి మల్లుదొర వారసులను కించపరచడం న్యాయమా అని వారు ప్రశ్నించారు. ఈ విషయం పలుమార్లు జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. మల్లుదొర వారసులుగా తినడానికి తిండి లేక, ఉండేందుకు ఇల్లు లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నామన్నారు. పాలకులు తమను గుర్తించి గంటందొర వారసులకు ఇచ్చిన గౌరవం మాకు వర్తింపజేయాలన్నారు. మాకు అన్ని వసతులతో కూడిన పక్కా ఇళ్లు సమకూర్చి జీవనోపాధికి తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. విలేకర్ల సమావేశంలో అల్లూరి యువజన సంఘం అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోన సత్తిబాబు మద్దతు పలికారు.
Updated Date - Feb 21 , 2025 | 10:44 PM