కిడ్నీ ఇప్పిస్తామంటూ లక్ష రూపాయలు కొట్టేసిన నకిలీ వైద్యులు!
ABN, Publish Date - Mar 01 , 2025 | 01:12 AM
కిడ్నీ ఇప్పిస్తామంటూ నకిలీ వైద్యులు లక్ష రూపాయలు తీసుకుని ఉడాయించారు.
మహారాణిపేట, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):
కిడ్నీ ఇప్పిస్తామంటూ నకిలీ వైద్యులు లక్ష రూపాయలు తీసుకుని ఉడాయించారు. ఈ విషయమై బాధితులు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉప్పరపేట గ్రామానికి దూసి రాంజీకి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న కుమారుడు మోక్షిత్ రామ్ (5) కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. చికిత్స కోసం అందినకాడికి రాంజీ అప్పులు చేశారు. బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కిడ్నీ మార్పిడి చికిత్సకు అవసరమైన సహాయం చేయాలని దాతలను కోరుతూ ఒక దినపత్రికలో ప్రకటన ఇచ్చారు. ఆ మరుసటిరోజు రాంజీకి ఒక ఫోన్ వచ్చింది. తాను కేజీహెచ్లో వైద్యుడిగా పనిచేస్తున్నానని, తన పేరు నరసింహం అంటూ ఆ వ్యక్తి చెప్పాడు. కిడ్నీ ఏర్పాటుచేస్తానన్నాడు. బాలుడి తండ్రి రాంజీ వెంటనే కేజీహెచ్కు వెళ్లి ఫోన్ చేయగా...తన అసిస్టెంట్ను పంపిస్తున్నానని, అతడిని కలవాలని సూచించాడు. తెల్ల కోటు వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి తన పేరు డాక్టర్ ప్రవీణ్గా పరిచయం చేసుకున్నాడు. రాంజీని కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయ ఆవరణ వద్దకు తీసుకువెళ్లి, అక్కడ నుంచి ఆస్పత్రిలోకి వెళ్లి వచ్చి సాయంత్రానికి లక్ష రూపాయలు సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పాడు. కేజీహెచ్లోనే కిడ్నీ డోనర్ ఉన్నారన్నాడు. బాలుడి తల్లి తన ఒంటి మీద ఉన్న వస్తువులను అమ్మింది. మరుసటిరోజుకు లక్ష రూపాయలు తీసుకువెళ్లారు. నరసింహానికి ఫోన్ చేయగా ఆ డబ్బును పిల్లల వార్డు వద్ద ఉన్న తన కారు డ్రైవర్కు ఇవ్వాలని చెప్పాడు. రాంజీ వాళ్లు చెప్పిన విధంగానే డబ్బును ఇచ్చేశాడు. డబ్బులు తీసుకున్నప్పటి నుంచి ముగ్గురి జాడ లేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో కేజీహెచ్లో సంబంధిత విభాగాలలో వైద్యులను సంప్రతించగా అటువంటివారు ఎవరూ లేరని తెలిపారు. దీంతో తమ నుంచి లక్ష రూపాయలు కాజేసింది నకిలీ డాక్టర్లుగా గుర్తించారు. వన్టౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
Updated Date - Mar 01 , 2025 | 01:12 AM