దాసు ఔట్
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:10 AM
పర్యాటక శాఖలో జరుగుతున్న కుర్చీలాటకు కలెక్టర్ హరేంధిరప్రసాద్ చెక్ పెట్టారు.
జిల్లా పర్యాటక శాఖ అధికారి (డీటీవో) పోస్టు నుంచి తప్పించిన కలెక్టర్
అవుట్సోర్సింగ్ ఉద్యోగికి నిధులు డ్రా చేసే అధికారం లేనందునే...
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
సుధాసాగర్కు బాధ్యతలు అప్పగింత
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):
పర్యాటక శాఖలో జరుగుతున్న కుర్చీలాటకు కలెక్టర్ హరేంధిరప్రసాద్ చెక్ పెట్టారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయినా గరికిన దాసును జిల్లా పర్యాటక శాఖ అధికారి (డీటీఓ) పోస్టు నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీచేశారు. పర్యాటక శాఖలో అధికారులు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ సంస్థ పరువును రోడ్డుకు ఈడ్చిన సంగతి తెలిసిందే. రుషికొండ బీచ్లో అదనపు ఆదాయం కోసం వర్గాలుగా విడిపోయి నిర్వహణను గాలికి వదిలేయడంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది. దీంతో ప్రభుత్వం విశాఖ డీటీఓగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణిని మాతృ శాఖకు పంపించేసింది. అలాగే ఈఈ రమణను అదనపు బాధ్యతలుగా నిర్వహిస్తున్న ఆర్డీ పోస్టు నుంచి తప్పించింది. డివిజనల్ మేనేజర్ జగదీశ్కు ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే ఏపీ పర్యాటక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి మేనేజర్గా పదోన్నతి పొంది విజయనగరం జిల్లా బాధ్యతలు చూస్తున్న గరికిన దాసును విశాఖ డీటీఓగా నియమిస్తూ ఏపీ పర్యాటక సంస్థ సీఈఓ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీచేశారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాను అదనపు బాధ్యతలుగా అప్పగించారు. గరికిన దాసు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని, విశాఖ వంటి కీలకమైన జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో పర్యాటక శాఖను నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొంటూ ‘కాంట్రాక్టు ఉద్యోగికి పర్యాటక పగ్గాలు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం కథనం ప్రచురించింది. దానిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విచారణ చేయించారు. పర్యాటక సంస్థలో నిధులు డ్రా చేయడానికి, ఖర్చు చేయడానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి అధికారం లేనందున గరికిన దాసును ఆ పోస్టు నుంచి తప్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు హెచ్పీసీఎల్లో భూ సేకరణ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న సనపల సుధాసాగర్ను డీటీఓగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడితో ఆ శాఖలో వివాదాలకు ఫుల్స్టాప్ పడుతుందని అంతా భావిస్తున్నారు. ఆర్డీగా కూడా పూర్తిస్థాయి అధికారిని నియమిస్తే ప్రభుత్వం అనుకున్నట్టుగా జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులు ఊపందుకునే అవకాశం ఉంది.
Updated Date - Mar 08 , 2025 | 01:10 AM