అరకులోయలో అడ్వంచర్ పారాగ్లైడింగ్ స్కూల్
ABN, Publish Date - Feb 01 , 2025 | 01:28 AM
అరకులోయ పరిసర ప్రాంతాలు అడ్వంచర్ పారాగ్లైడింగ్కు ఎంతో అనుకులంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ అన్నారు. అరకు చలి ఉత్సవ్లో భాగంగా తొలిరోజు శుక్రవారం మాడగడ సన్రైజ్ హిల్స్లో పారాగ్లైడింగ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అరకులోయలో అడ్వంచర్ పారాగ్లైడింగ్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచ స్థాయి పారాగ్లైడింగ్లో అనుభవం ఉన్న వారిని అరకు చలి ఉత్సవ్కు ఆహ్వానించామన్నారు. ఉత్సవ్కు ముందు వారు అరకు ప్రాంతంలో పలు ప్రదేశాలను పరిశీలించి, మాడగడ సన్రైజ్ హిల్స్ అనుకూలంగా ఉందని గుర్తించారన్నారు.
జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్
పారాగ్లైడింగ్కు అరకు ప్రాంతం అనుకూలం
అరకులోయ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
అరకులోయ పరిసర ప్రాంతాలు అడ్వంచర్ పారాగ్లైడింగ్కు ఎంతో అనుకులంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ అన్నారు. అరకు చలి ఉత్సవ్లో భాగంగా తొలిరోజు శుక్రవారం మాడగడ సన్రైజ్ హిల్స్లో పారాగ్లైడింగ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అరకులోయలో అడ్వంచర్ పారాగ్లైడింగ్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచ స్థాయి పారాగ్లైడింగ్లో అనుభవం ఉన్న వారిని అరకు చలి ఉత్సవ్కు ఆహ్వానించామన్నారు. ఉత్సవ్కు ముందు వారు అరకు ప్రాంతంలో పలు ప్రదేశాలను పరిశీలించి, మాడగడ సన్రైజ్ హిల్స్ అనుకూలంగా ఉందని గుర్తించారన్నారు. అరకు ఉత్సవ్లో పారాగ్లైడింగ్తోపాటు పర్యాటకులు టేండమ్ గ్లైడింగ్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. పారాగ్లైడింగ్లో స్థానిక గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. మార్చి నెలాఖరులో 20 మంది పారాగ్లైడింగ్లో అనుభవం ఉన్న వారితో ప్రత్యేక రెక్కీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వారిచ్చే నివేదిక మేరకు భవిష్యత్తులో అంతర్జాతీయ పారాగ్లైడింగ్ ఈవెంట్స్ను అరకులోయలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
5కే రన్ ప్రారంభం
అరకు రైల్వే స్టేషన్ నుంచి శుక్రవారం ఉదయం 8గంటలకు ఉత్సవ్ ప్రధాన వేదిక వరకు 5కె రన్ను జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్, జేసీ అభిషేక్గౌడ్, ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఏఎస్పీ ధీరజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5కె రన్లో ఏఎస్పీ ధీరజ్, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ 5కె రన్లో కె.రమేశ్, విశాల్ అభిషేక్, శామ్యూల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగే బాలికల విభాగంలో లిట్టిగుడ గ్రామానికి చెందిన రెండో తరగతి చదువుతున్న కొర్రా జీవన్తన్య మొదటి స్థానంలో నిలవగా.. డిగ్రీ కళాశాల విద్యార్థిని మంజుల రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.
Updated Date - Feb 01 , 2025 | 01:28 AM