Port: మూలపేట పోర్టు నిర్మాణం డొల్ల
ABN, Publish Date - Mar 03 , 2025 | 11:52 PM
Construction Delay సంతబొమ్మాళి మండలంలో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణమంతా డొల్లని తేలింది. ఇప్పటివరకు ఈ పోర్టుకు రూ.1,155 కోట్లు మంజూరు చేయగా.. అన్నివిధాలా ఖర్చు చేసింది రూ.240 కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం బహిర్గతం చేశారు.
- అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన మంత్రి అచ్చెన్న
- నాడు వైసీపీ నేతల హడావుడే మిగిలింది
టెక్కలి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలంలో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణమంతా డొల్లని తేలింది. ఇప్పటివరకు ఈ పోర్టుకు రూ.1,155 కోట్లు మంజూరు చేయగా.. అన్నివిధాలా ఖర్చు చేసింది రూ.240 కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం బహిర్గతం చేశారు. మూలపేట పోర్టుకు 2023 ఏప్రిల్19న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రొటోకాల్ ఉల్లంఘించి మరీ శంకుస్థాపన చేశారు. 826 ఎకరాల్లో రూ.4,361.91కోట్లతో పోర్టు నిర్మాణం చేసి మొదటి ఫేజ్లో 23.5ఎంటీపీఏ ఎగుమతి, దిగుమతులకు, అలాగే నాలుగు బెర్త్లు, అందులో రెండు జనరల్ కార్గో, ఒక కోల్, ఒక మల్టీపర్పజ్కు రవాణాకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి 2,455 మీటర్ల సౌత్బ్రేక్ గోడ, 580 మీటర్ల నార్త్బ్రేక్ గోడ నిర్మాణం చేపట్టాలని అప్పట్లో పనులు ప్రారంభించారు. డ్రెజ్జింగ్ పనులు కూడా ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. అలాగే పోర్టుకు సంబంధించి భూసేకరణ, ఉప్పు భూములు, రైల్వే భూముల సేకరణ, నిర్వాసితుల సమస్య ఏవీ పూర్తిస్థాయిలో పరిష్కారం చూపలేకపోయారు. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ ముఖ్య నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పరిశ్రమల శాఖ మాజీమంత్రి అమర్నాథ్, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పోర్టు ప్రాంతంలో పర్యటించారు. మూలపేట పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.. షిప్ వచ్చేస్తుందని హడావుడి చేసి ఓటర్లను నమ్మబలికే ప్రయత్నం చేశారు. పోర్టు నిర్మాణంలో వేలమంది స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. కాగా.. నేడు అసెంబ్లీ వేదికగా.. అవన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. విశ్వసముద్ర ఇంజనీరింగ్ సంస్థ ద్వారా ఈ పనులు చకచకా చేయిస్తున్నామని మాటలు చెప్పారే తప్ప చేతల్లో లేవని నిరూపితమైంది. మొత్తంగా పోర్టు నిర్మాణ బాధ్యతల భారం కూటమి ప్రభుత్వంపై పడింది.
Updated Date - Mar 03 , 2025 | 11:52 PM