చెరువులో స్కూల్ బస్సు బోల్తా
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:25 AM
మందస మండలంలోని ఉమాగిరి గ్రామం వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి చెరు వులో బోల్తా పడింది. గ్రామ స్థులు సకాలంలో స్పందించి విద్యార్థులను బయటకు తీయడంతో ప్రాణనష్టం తప్పింది.
- ఐదుగురు విద్యార్థులకు గాయాలు
- గ్రామస్థులు స్పందించడంతో తప్పిన ముప్పు
హరిపురం, ఫిబ్రవరి15 (ఆంధ్రజ్యోతి): మందస మండలంలోని ఉమాగిరి గ్రామం వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి చెరు వులో బోల్తా పడింది. గ్రామ స్థులు సకాలంలో స్పందించి విద్యార్థులను బయటకు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. గాయపడిన ఐదు గురు విద్యార్థులను హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు 32 మంది విద్యార్థులతో మందస నుంచి బైరిసారంగపురం, పితాతోళి మీదుగా సిద్ధిగాం, బుడార్సింగి, పెడంగో మార్గంలో వెళ్తుండగా ఉమాగిరి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి చెరువులో బోల్తాపండింది.
ఈ ఘటనలో బుడార్సింగి, పెడంగో గ్రామాలకు చెందిన ఎన్.ధీరజ్, ఎన్.లోకేష్, పవిత్ర పట్నాయిక్, హర్షిత, మహేష్గౌడ గాయపడ్డారు. వీరిని 108లో హరిపురం ఆసుపత్రికి తరలించగా వైద్యులు స్వరాజ్యలక్ష్మి, ఐశ్వర్య చికిత్స అందించారు. చిన్న గాయాలేనని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే, గ్రామానికి ఆనుకొని ఉండే కోనేరు కావడంతో వెంటనే బస్సు డ్రైవరు, స్థానికుల సాయంతో విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీసి ఒడ్డుకు చేర్చారు. సకాలంలో గ్రామస్థులు ఆదుకోవటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగ లేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద వివరాలను ఎంఈవో లక్ష్మణరావు ఉన్నతాధికారులకు నివేదించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
Updated Date - Feb 16 , 2025 | 12:25 AM