సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
ABN, Publish Date - Mar 06 , 2025 | 02:24 AM
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం వస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పలువురు జిల్లాస్థాయి అధికారులతో కలిసి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సభాస్థలి, కార్యకర్తల సమావేశం, హెలిప్యాడ్ స్థలాల కోసం పరిశీలన చేశారు.
మార్కాపురంలో పరిశీలించిన యంత్రాంగం
ఎస్వీకేపీలో మహిళా దినోత్సవం
దరిమడుగు వద్ద పార్టీ కార్యకర్తల సమావేశం
పరిమిత సంఖ్యలోనే జనసమీకరణకు సీఎంవో ఆదేశం
మార్కాపురం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం వస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పలువురు జిల్లాస్థాయి అధికారులతో కలిసి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సభాస్థలి, కార్యకర్తల సమావేశం, హెలిప్యాడ్ స్థలాల కోసం పరిశీలన చేశారు. ఐదు ప్రాంతాలను గుర్తించారు. మహిళా దినోత్సవానికి 3వేల మంది, కార్యకర్తల సమావేశానికి 400 మందికి మించి జనసమీకరణ చేయవద్దని సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. అందుకనుగు ణంగానే అధికారులు కూడా పలు ప్రాంతాలను పరిశీలించారు. ఒంగోలు నుంచి మార్కాపురం చేరుకునే క్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా తొలుత మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామం వద్ద మెడికల్ కళాశాల సమీపంలోని పొలాలను పరిశీలించారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతాయని భావించారు. నేరుగా ఎస్వీకేపీ కళాశాల మైదానంలోకి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తర్లుపాడు రోడ్డులోని సాయిబాలాజీ స్కూల్ సమీపంలోని పాత హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి తర్లుపాడు మండలం సీతానాగులవరంనకు చేరుకొని రెండు ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ అంతా బాగానే ఉన్నా ప్రధాన రహదారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో విరమించుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని హెలిప్యాడ్ స్థలాన్ని మారిస్తే బాగుంటుందని భావించారు. బోడపాడు రహదారిలోని రియల్ ఎస్టేట్ వెంచర్ను పరిశీలించి అనువైనదిగా గుర్తించారు. కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశానికి దరిమడుగు గ్రామం వద్ద స్థలం ఎంపిక చేశారు. అనంతరం మళ్లీ ఎస్వీకేపీ కళాశాల వద్దకు చేరుకుని మహిళా దినోత్సవాన్ని కాలేజీలో, కార్యకర్తల సమావేశాన్ని దరిమడుగులో, హెలిప్యాడ్ను బోడపాడు రోడ్డులో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అవసరమైన చర్యలపై పలువురు జిల్లా అఽధికారులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పలు సూచనలు చేశారు. వెంటనే ఆయా ప్రాంతాల్లో పనులు కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, సబ్కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, జడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న తదితర అధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఎస్వీకేపీ కళాశాలలో బుధవారం అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు, డివిజన్ స్థాయి అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమం మార్కాపురంలో జరుగుతోందన్నారు. సీఎం పర్యటనకు సంబంధించి కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రధానంగా సభాస్థలంలో వేదిక, బారికేడ్లు, వీఐపీ, సాధారణ ప్రజల పార్కింగ్, మహిళల స్టాల్స్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమం అయినందున ఇతర జిల్లాలకు చెందిన మహిళా అచీవర్స్, వివిధ శాఖల హెచ్వోడీలు వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. సీఎం సందర్శించే స్టాల్స్పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 02:24 AM