సినీఫక్కీలో పింఛన్ సొమ్ము చోరీ
ABN, Publish Date - Feb 02 , 2025 | 01:34 AM
పింఛన్ పంపిణీ చేసేందుకు మోటార్ సైకిల్పై వెళ్తున్న సచివాలయ ఉద్యోగిని అడ్డుకొని సినీ ఫక్కీలో నగదు చోరీ చేసిన ఘటన మండలంలోని బాదాపురం గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది.
బైక్పై వస్తున్న ఉద్యోగిని అడ్డగించి రూ.2.68లక్షలు అపహరణ
సచివాలయ ఉద్యోగుల్లో కలకలం
అప్రమత్తమైన పోలీసులు
రంగంలోకి డాగ్స్క్వాడ్
దొనకొండ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : పింఛన్ పంపిణీ చేసేందుకు మోటార్ సైకిల్పై వెళ్తున్న సచివాలయ ఉద్యోగిని అడ్డుకొని సినీ ఫక్కీలో నగదు చోరీ చేసిన ఘటన మండలంలోని బాదాపురం గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మండలంలోని చందవరం గ్రామానికి చెందిన వీరంరెడ్డి రంగారెడ్డి మండలంలోని పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. పంచాయతీ పరిధిలోని 58 మంది పింఛన్దారులకు సంబంధించిన రూ.2.68 లక్షల నగదును శుక్రవారం తీసుకొని సాయంత్రం తన స్వగ్రామమైన చందవరానికి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున పింఛన్ నగదు పంపిణీ నిమిత్తం చందవరం నుంచి తన ద్విచక్ర వాహనంపై దొనకొండకు బయల్దేరారు. మార్గమధ్యంలో ముఖం కనబడకుండా కర్చీఫ్లు కట్టుకున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెల్ఫేర్ అసిస్టెంట్ రంగారెడ్డిని ద్విచక్ర వాహనంపై వెంబడించారు. బాదాపురం సమీపంలో అనువుగా ఉండటంతో అడ్డగించారు. అతన్ని కిందకు నెట్టేసి నగదు ఉన్న బ్యాగును లాక్కొని ద్విచక్ర వాహనంపై చందవరం వైపు వెళ్లిపోయారు. వెంటనే రంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిపురాంతకం సీఐ హస్సాన్ హుటాహుటిన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వెల్ఫేర్ అసిస్టెంట్ రంగారెడ్డిని సంఘటన జరిగిన తీరుపై విచారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్ను పిలిపించి దొంగల ఆనవాళ్ల కోసం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు.
పింఛన్ డబ్బుతో సచివాలయ ఉద్యోగి పరార్
మార్కాపురం : పింఛన్లు పంపిణీ చేయాల్సిన సచివాలయ ఉద్యోగి ఆ మొత్తం సొమ్ముతో ఉడాయించిన వైనం శనివారం వెలుగుచూసింది. సుమారు 61 మందికి అందజేయాల్సిన రూ.2.66 లక్షలతో సదరు ఉద్యోగి పరారయ్యాడు. స్థానిక 10వవార్డులోని 18వ సచివాలయంలో పాలడుగు వెంకటేశ్వర్లు ఎమినిటీస్ సెక్రటరీగా పనిచేస్తున్నా డు. శనివారం రాజ్యలక్ష్మి కాలనీలో పింఛన్లు పంపిణీ చేసేందుకు శుక్రవారం రాత్రే అడ్మిన్ సెక్రటరీ కె.వెంకటేశ్వరరెడ్డి దగ్గర సంతకం చేసి నగదును తీసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం అవుతున్నా ఎవరికీ ఫించన్ సొమ్ము అందజేయ లేదు. దీంతో అడ్మిన్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి విషయాన్ని మునిసిపల్ కమిషనర్ నారాయ ణరావు దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ వాట్సప్ ద్వారా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Updated Date - Feb 02 , 2025 | 01:34 AM