నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN, Publish Date - Mar 01 , 2025 | 01:45 AM
జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరగనుంది. ద్వితీయ సంవత్సరం వారికి సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
నిమిషం లేటైనా నో ఎంట్రీ
సీసీ కెమెరాలతో నిఘా
సెల్ఫోన్లు నిషేధం
ఒంగోలు విద్య, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరగనుంది. ద్వితీయ సంవత్సరం వారికి సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 42,439 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరిలో 21,624 మంది ప్రథమ, 20,815 మంది ద్వితీయ సంవత్సరం వారు ఉన్నారు. అందుకోసం 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లోని అన్ని గదులకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను విజయవాడలోని ఇంటర్మీడియెట్ బోర్డు, ఒంగోలులోని ఆర్ఐవో కార్యాలయానికి అనుసంధానం చేశారు. పరీక్షలు జరిగే విధానాన్ని ఈ కేంద్రాల నుంచి నేరుగా వీక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 8.30కు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష మొదలైన తర్వాత నిమిషం లేటైనా విద్యార్థులను లోపలికి అనుమతించరు. జిల్లాలో కంభం, పెద్దారవీడు, అర్ధవీడు, ఎర్రగొండపాలెం, గిద్దలూరులోని కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. కాపీయింగ్ను నిరోధించేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు మూడేసి చొప్పున ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఆర్ఐవో, డీఈసీ సభ్యులు, జిల్లా పరిశీలకులు, బోర్డు అధికారులు, కలెక్టర్, జిల్లా అధికారులు కూడా కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. మరోవైపు ఆర్ఐవో కార్యాలయలో కంట్రోలు రూంను కూడా ఏర్పాటు చేశారు. అందుకోసం 08592-281275 నెంబరును కేటాయించారు.
Updated Date - Mar 01 , 2025 | 01:45 AM