అలా ఎలా చేస్తారు?
ABN, Publish Date - Feb 25 , 2025 | 01:40 AM
నిబంధనలకు విరుద్ధంగా పొగాకు సమాఖ్య పీఐసీ చైర్మన్ నియామకం
నిబంధనలకు విరుద్ధంగా పొగాకు సమాఖ్య పీఐసీ చైర్మన్ నియామకం
బాధ్యులైన డీసీవో, డీఎల్సీవోపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి
ఒంగోలు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమా ఖ్య (పొగాకు సమితి) పర్సన్ ఇన్చార్జి (పీఐ సీ) చైర్మన్ నియామకంలో డీసీవో శ్రీనివాస రెడ్డి, డీఎల్సీవో పోలిశెట్టి రాజశేఖర్లు నిబంధ నలకు విరుద్ధంగా వ్యవహరించారని టీడీపీ ఒంగోలు నగర కమిటీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు ఆరోపించారు. ఆ నియామకాన్ని రద్దు చేయడంతోపాటు అందుకు బాధ్యులైన డీసీవో, డీఎల్సీవోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒంగోలు కేంద్రంగా ఉన్న పొగాకు సమాఖ్య పరిధిలో ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది రైతులు ఉన్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో దాదాపు 11వేల మంది టీడీపీ మద్దతుదారులైన రైతులను గత వైసీపీ ప్రభుత్వంలో సహకార శాఖ అధికారుల సహకారంతో వైసీపీ నేతలు తొలగించి వేసి పాలకవర్గాన్ని కైవసం చేసుకున్నారన్నారు. ఈనెల 12తో సదరు పాలకవర్గ పదవీ కాలం పూర్తి కాగా జిల్లా సహకార ఆడిట్ అధికారి కార్యాలయం నుంచి అసిస్టెంట్ రిజస్ట్రార్గా ఉన్న సూది శ్రీనివాసరావును డీసీఎల్వో రాజశేఖర్ నియమించారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సమాఖ్యకు పీఐసీ చైర్మన్గా డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి లేదా అంతకన్నా ఎక్కువ కేడర్ ఉన్న అధికారిని నియమించాల్సి ఉందన్నారు. అయితే అందుకు విరుద్ధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉన్న శ్రీనివాసరావును నియమించారన్నారు. అది కూడా డీఎల్సీవో పరిధిలో కాకుండా ఆడిట్ ఆఫీసులో ఉన్న ఉద్యోగిని నియమించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది చెల్లుబాటు కాదన్న విషయం తెలిసినా డీసీవో శ్రీనివాసరెడ్డి ఎలాంటి చర్యలను డీఎల్సీవోపై తీసుకోలేదన్నారు. ఇరువురు అధికారులు ఈ నియామకం ద్వారా ప్రభుత్వాన్ని, సమాఖ్యను, రైతులను మోసగించారని ఆరోపించారు. వారిరువుపై చర్యలు తీసుకోవడంతోపాటు పొగాకు సమాఖ్య పీఐసీ నియామక ఉత్తర్వులు రద్దుచేసి మరొక అధికారిని నియమించాలని కోరారు. గతంలో ఇలాంటి సమయంలో పీఐసీ చైర్మన్లుగా నియమితులైన ఉన్నతాధికారుల జాబితాను కూడా కలెక్టర్కు నాగేశ్వరరావు అందజేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో టీడీపీ నాయకులు గొల్లపూడి బాబూరావు, కోటపాటి కాళీరావులు కూడా ఉన్నారు.
Updated Date - Feb 25 , 2025 | 01:40 AM