రీసర్వే పక్కాగా నిర్వహించాలి
ABN, Publish Date - Mar 05 , 2025 | 12:09 AM
రీసర్వే పక్కాగా నిర్వహించాలి
రెవెన్యూ అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
సర్వేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రంజిత్ బాషా
మండల సర్వేయర్కు షోకాజ్..
విలేజ్ సర్వేయర్ను సస్పెండ్ చేయాలని కర్నూలు ఆర్డీవోకు ఆదేశాలు
వెల్దుర్తి టౌన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వెల్దుర్తి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాల్లో రీసర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించిన రైతుల అర్జీలను గడువులోపు పరిష్కరించాలన్నారు. మండలంలోని పీజీఆర్ఎస్ సర్వే అర్జీలకు గడువు లోపుల పరిష్కారం చూపకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల సర్వేయర్కు నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని కర్నూలు ఆర్డీవోను ఆదేశించారు. అలాగే రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామసభల వివరాలు సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్కు సంబంధించి ఒక అర్జీ విలేజ్ సర్వేయర్ లాగిన్లో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండటం గమనించిన కలెక్టర్ ఆ విలేజ్ సర్వేయర్ను సస్పెండ్ చేయాలని కర్నూలు ఆర్డీవోను ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డు గదులను కార్యాలయ సిబ్బంది గదులను పరిశీలించి ఎంత మంది వీఆర్వోలు, ఎంత మంది సిబ్బంది ఉన్నారని తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, మండల తహసీల్దార్ చంద్రశేఖర వర్మ, ఎంపీడీవో సుహాసినమ్మ ఉన్నారు.
Updated Date - Mar 05 , 2025 | 12:10 AM