మయూరంపై మల్లన్న
ABN, Publish Date - Feb 22 , 2025 | 11:01 PM
శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు శనివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, అమ్మవారు మయూరవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
టీటీడీ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు
కిక్కిరిసిన పాతాళగంగ ఘాట్
నేడు రావణ వాహనంపై స్వామి, అమ్మవార్లు
శ్రీశైలం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు శనివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, అమ్మవారు మయూరవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో ముస్తాబు చేసి మయూర వాహనంపై కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయం రాజగోపురం నుంచి వెలుపలకి తీసుకొచారు. గంగాధర మండపం నుంచి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం ఎదుట కోలాటం, చెక్కభజన, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, బుట్టబొమ్మల నృత్యాలు, బీరప్పడోలు, తప్పెట్లు, బంజారా నృత్యం, శంఖునాదాలు మార్మోగాయి. ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గంగాధర మండపం మీదుగా నందిమండపం వరకు తిరిగి అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం దాకా కొనసాగింది. వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీశైల క్షేత్ర వీధులన్నీ కిక్కిరిశాయి. శివదీక్షాపరులు పవిత్ర పాతాల గంగలో పుణ్యస్నానాలు అచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
టీటీడీ, కాణిపాకం నుంచి పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఈఓ కె.పెంచలకిషోర్ తోపాటు ఆస్థానాచార్యలు ఫణికుమారశర్మ, అర్చకులు గణే్షగుర్కుల్ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జె.శ్యామలరావు దంపతులు బ్రమరాంభ మల్లికార్జున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలతో వచ్చిన వీరికి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకస్వాములు పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఈఓ అన్నారు.
నేడు రావణవాహన సేవ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలో భాగంగా ఐదవరోజు శనివారం సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లుకు రావణవాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Updated Date - Feb 22 , 2025 | 11:01 PM