కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు
ABN, Publish Date - Feb 09 , 2025 | 01:39 AM
ఎ.కొండూరు కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, వివిధ శాఖల సమన్వయంతో జనజాగృతి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని, కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
నిరాటంకంగా డయాలసిస్, నెఫ్రాలజిస్టు సేవలు
సీకేడీ నివారణ, నియంత్రణపై సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
ఎన్టీఆర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఎ.కొండూరు కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, వివిధ శాఖల సమన్వయంతో జనజాగృతి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని, కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎ.కొండూరు కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధి నివారణ, నియంత్రణకు భవిష్యత్ కార్యాచరణపై కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 18న జీజీహెచ్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) కేసులపై నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలు, వచ్చిన సూచనలపై చర్చించారు.
కాడ్మియం, ఆర్సినిక్ గుర్తింపునకు పరీక్షలు నిర్వహించాలి
పీల్చే గాలిలో యురేనియం, కాడ్మియం, ఆర్సినిక్ ఆనవాళ్లు ఉన్నా యా? అనేది నిర్ధారించేందుకు 20 రోజుల్లోగా పరీక్షలు నిర్వహించాలని కాలుష్య నియంత్రణ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నెఫ్రో టాక్సిక్ మెటల్ నిర్ధారణకు మట్టి పరీక్షలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇళ్ల ఆవరణల్లో నీటి వనరుల నమూనాలను పరీక్షించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖకు సూచించారు. ఒకవైపు శాస్ర్తీయ శోధనలు నిర్వహిస్తూనే 3,600 గృహాలున్న 15 తండాలతో పాటు తండాయేతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే నవోదయం ద్వారా ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్ర మాలను మరింత విస్తరించాలని సూచించారు. నాటుసారాకు అడ్డుకట్ట వేయడం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ వాడకుం డా చూడడం కోసం ప్రచార సామగ్రిని, డిజిటల్ కంటెంట్ను రూపొందించాలని, కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నెఫ్రాలజిస్టు, డయాలసిస్ సేవలు నిరాటంకంగా షెడ్యూల్ ప్రకారం కొనసాగేలా చూడాలని సూచించారు. డీఎంహెచ్వో ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ డాక్టర్ బీసీకేనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ కె.శ్రీనివాస్, జీజీహెచ్ నెఫ్రాలజీ విభాగాధిపతి సిహెచ్.నాగేశ్వరరావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయకర్త డాక్టర్ జె.సుమన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 01:40 AM