మెప్పించిన ‘పార్వతీ కల్యాణం’ యక్షగానం
ABN, Publish Date - Feb 25 , 2025 | 12:33 AM
మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో ముమ్మానేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శించిన పార్వతీ కల్యాణం (కూచిపూడి యక్షగానం) ప్రేక్షకులను మెప్పించింది
మెప్పించిన ‘పార్వతీ కల్యాణం’ యక్షగానం
విజయవాడ కల్చరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో ముమ్మానేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శించిన పార్వతీ కల్యాణం (కూచిపూడి యక్షగానం) ప్రేక్షకులను మెప్పించింది. ఈ ప్రదర్శనలో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ గ్రహీత డాక్టర్ చింతా రవిబాలకృష్ణ బృందం పాల్గొని, ఆదిదంపతులైన పార్వతీ- పరమేశ్వరుల వివాహకథను సజీవంగా ఆవిష్కరించారు. హిమవంతుని కుమార్తె పార్వతీదేవి, పరమశివుని వివాహం చేసుకో వాలనే సంకల్పంతో ఆయనను భక్తిశ్రద్ధలతో పూజిస్తుంది. అయితే ఈశ్వరుడు స్పందించక పోవడంతో, మన్మధుడు పుష్ప బాణాన్ని ప్రయోగించి శివుని తపస్సుకు భంగం కలిగిస్తాడు. కోపోద్రిక్తుడైన శివుడు, తన త్రినేత్రంతో మన్మధుని భస్మం చేస్తాడు. రతీదేవి ప్రార్థనతో, శివుడు మన్మధునికి పునర్జన్మ ప్రసాదించి పార్వతీదేవిని వివాహం చేసుకొంటాడు. ఈ ప్రదర్శనలో నట్టువాంగం డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, సహకార నట్టువాంగం కొరవి సుబ్రహ్మణ్య ప్రసాద్, గాయకులు కుమార సూర్యనారాయణ, గాయని సుధారాణి, వయోలిన్ పాలపర్తి ఆంజ నేయులు, మృదంగం పసుమర్తి హరినాథశాస్ర్తి, వేణువు కుమార బాబులు వాద్య సహకారం అందించారు. పాత్రధారులుగా పరమేశ్వరుడు డి.వర్షితవర్మ, పార్వతీదేవి పెదపూడి నాగశ్రీప్రవల్లిక, మన్మధుడు నదుల సరయు, రతీదేవి ఎల్.సాయి నాగసుస్మిత, భృంగి సూరుకుర్తి యాసశ్రీ తమ నృత్యంతో ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం కళాకారులను అకాడమీ ప్రతినిధులు సెక్రటరీ లలిత ప్రసాద్, బీవీఎస్ ప్రకాష్ సత్కరించారు.
Updated Date - Feb 25 , 2025 | 12:33 AM