వరసిద్ధుడి ఆలయ ప్రధాన అర్చకుడిపై సస్పెన్షన్ ఎత్తివేత
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:53 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్పై ఉన్న సస్షెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
ఫిర్యాదుదారుడి సమక్షంలో విచారణ చేపట్టాలని దేవదాయశాఖకు సూచించిన హైకోర్టు
ఐరాల(కాణిపాకం), మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్పై ఉన్న సస్షెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సోమశేఖర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందారని దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు గత ఏడాది అక్టోబరు 28వ తేదీన ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. అప్పటి ఆలయ ఈవో నివేదికల ఆధారంగా సోమశేఖర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. దీనిపై సోమశేఖర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్నాక సోమశేఖర్ గురుకుల్పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఫిర్యాదుదారుడి సమక్షంలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ అధికారులకు సూచిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై ఆలయ ఈవో పెంచలకిషోర్ను వివరణ కోరగా.. సోమశేఖర్ గురుకుల్పై విధించిన సస్పెన్షన్ ఎత్తి వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఆయన్ను ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగిస్తూ.. వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.
Updated Date - Mar 08 , 2025 | 01:53 AM