ముగిసిన ఆలయాల సదస్సు
ABN, Publish Date - Feb 20 , 2025 | 02:41 AM
తిరుపతిలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయాల సదస్సు బుధవారం అంతే ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి సంబంధించిన ఆలయాలు, సంస్థల నుంచీ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఐటీసీఎక్స్-2025 నిర్వహణకు వేదికగా నిలవడం ద్వారా తిరుపతి ఖ్యాతి మరింత పెరిగింది. దేశవిదేశాల నుంచీ హిందూ సమాజ ఉన్నత స్థాయి వ్యక్తుల రాక సదస్సు స్థాయిని చాటి చెప్పింది.
- మూడు రోజుల పాటు ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రసంగాలు, చర్చలు
- ఐటీసీఎక్స్-2025 నిర్వహణతో పెరిగిన తిరునగరి ఖ్యాతి
ఆరణి శ్రీనివాసులు, కురుగొండ్ల రామకృష్ణ, బొజ్జల సుధీర్రెడ్డి, టీటీడీ సభ్యుడు భానుప్రకా్షరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి
తిరుపతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయాల సదస్సు బుధవారం అంతే ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి సంబంధించిన ఆలయాలు, సంస్థల నుంచీ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఐటీసీఎక్స్-2025 నిర్వహణకు వేదికగా నిలవడం ద్వారా తిరుపతి ఖ్యాతి మరింత పెరిగింది. దేశవిదేశాల నుంచీ హిందూ సమాజ ఉన్నత స్థాయి వ్యక్తుల రాక సదస్సు స్థాయిని చాటి చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎ్సఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి వారి సందేశాలతో సదస్సు ప్రారంభం కాగా దేశంలోనే పేరుమోసిన వారణాసి, అయోధ్య వంటి ఆలయాల నిర్వాహకులు, పలువురు పీఠాధిపతులు రావడం సదస్సుకు నిండుదనాన్ని సంతరించిపెట్టింది. మరోవైపు ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, దేవదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరు కావడంతో రాజకీయ సందడి నెలకొంది. ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులైన ప్రముఖుల ప్రసంగాలు ఆహూతులకు విజ్ఞానాన్ని పంచగా.. సదస్సులో సాగిన చర్చలు ఆసక్తి రేపాయి. అలాగే సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రధానంగా పలు ఆలయాల చరిత్ర, సమాచారాలతో పాటు ఆలయాల నిర్వహణతో ముడిపడిన టెక్నాలజీని పరిచయం చేశాయి.
ఇనుమడించిన తిరుపతి ఖ్యాతి
గతంలో ఏఐసీసీ ప్లీనరీ, ప్రపంచ తెలుగు మహాసభలు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సభలు, సమావేశాలకు తిరుపతి వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా భాసిస్తున్న తిరుపతిలో ఆధ్మాత్మికంగా ఈ స్థాయి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు ఇప్పటి దాకా లేవు. తాజాగా ఐటీసీఎక్స్-2025 సదస్సు నిర్వహణతో ఆ లోటు కూడా పూడినట్టయింది. ఏకంగా 17 దేశాలకు చెందిన 1500కు పైగా పేరున్న ఆలయాల నిర్వాహకులు తిరుపతి వేదికగా మూడు రోజుల పాటు సదస్సులో పాల్గొనడం నగర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు శ్రీవారి దర్శనం కల్పించాలని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించడం తెలిసిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ముడిపడి వుండడంతో భవిష్యత్తులో కూడా తిరుపతి వేదికగా ఈ తరహా జాతీయ, అంతర్జాతీయ ఆధ్మాత్మిక సదస్సులు మరిన్ని జరిగేందుకు అవకాశమేర్పడుతోంది.
సదస్సు తీరుపై అసంతృప్తులూ ఉన్నాయ్
తిరుపతిలో ఎంత గొప్పగా ఐటీసీఎక్స్ సదస్సు నిర్వహించినా స్థానికులతో పాటు సామాన్యులకు ప్రవేశం లేకపోవడం అసంతృప్తిని మిగిల్చింది. సదస్సులో అనేక దేశాలకు చెందిన ఆలయాల నిర్వాహకులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, దేశంలోని వివిధ స్థాయిల్లో వున్న వీవీఐపీల రాక కారణంగా భద్రాపరంగా సదస్సు నిర్వహణలో ఆంక్షలు, పరిమితులు ఎక్కువగా కనిపించాయి. కేవలం పాస్ జారీ చేసిన ప్రతినిధులను మాత్రమే పరిమితంగా అనుమతించారు. అందువల్ల సదస్సుకు హాజరు కావాలన్న ఆసక్తి ఎంతోమందికి వున్నా హాజరు కాలేకపోయారు. దానికి తోడు ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితులైన అనేక హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు రాకపోవడం కూడా వెలితిగా అనిపించింది. వారిని భాగస్వామ్యం చేసివుంటే బాగుండేదన్న భావన జనంలో కనిపించింది. సదస్సు లక్ష్యం సనాతన ధర్మ వ్యాప్తి, పరిరక్షణ అయినప్పుడు ఇలా పరిమితులతో సదస్సులు నిర్వహిస్తే ఆ లక్ష్యం ఎలా నెరవేరుతుందని, ప్రస్తుత యువతరానికి సదస్సు సందేశం ఎలా చేరుతుందని జనం ప్రశ్నించడం వినిపించింది.
టీటీడీకి పెరిగిన ప్రాధాన్యం
ఈ సదస్సు ద్వారా ప్రత్యేకించి టీటీడీకి ప్రాధాన్యం మరింత పెరిగింది. సదస్సులో అనేక సందర్భాల్లో టీటీడీ ప్రస్తావనకు రావడం గమనార్హం. ఆలయాల నిర్వహణ, పాలనలో టీటీడీ దేశంలోని ఇతర దేవాలయాలకు నమూనాగా మారి మార్గదర్శనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశం సదస్సులో పదేపదే ప్రస్తావనకు వచ్చింది. తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దాన్ని టీటీడీలో కూడా అమలు చేస్తామని మంత్రి లోకేశ్ చేసిన ప్రకటనతో మరోసారి టీటీడీ సదస్సులో చర్చనీయాంశమైంది.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో రూ.7.5 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన అధునాతన ఇండోర్ స్టేడియంను బుధవారం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఏరోబిక్స్, తైక్వాండో, యోగా, ధ్యాన కేంద్రాలను, సబ్ స్టేషన్-3 శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి కాసేపు షటిల్ ఆడారు. యూనివర్సిటీలోని క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని కోరారు. ఇటువంటి అధునాతన ఇండోర్ స్టేడియం నిర్మించడం వల్ల క్రీడాకారులకు మంచి ప్రయోజనం కలుగుతుందని క్రీడలశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రీడా సదుపాయాలను విద్యార్థినులు వినియోగించుకోవాలని వీసీ ఉమ, శాప్ చైర్మన్ రవినాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, శాప్ ఎండీ గిరీషా, కలెక్టర్ వెంకటేశ్వర్, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రజని, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, బల్లి కళ్యాణ చక్రవర్తి, ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, తిరుపతి కమిషనరు మౌర్య, పద్మావతి వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ శారా సరోజిని, పీఆర్వో శ్రీరజని, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పద్మావతి వర్సిటీలోని టెక్నాలజీ బిజినెస్ ఇన్క్యూబేటర్ (టీబీఐ), ఐటీ, లైఫ్ సైన్సెస్ ల్యాబ్లను మంత్రి లోకేశ్ పరిశీలించారు. 2.5 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే డ్రోన్ను తాము కేవలం రూ.5 లక్షలతో తాము తయారు చేస్తున్నట్టు అక్కడి నిపుణుల తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో చేపట్టిన జ్ఞానభేరి కార్యక్రమం సందర్భంగా ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. రూ.40 లక్షల దాకా స్టార్ట్పలకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 26 మందికి ఇచ్చామనీ, త్వరలో మరో 14 మందికి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇన్నోవేషన్స్, స్టార్ట్పలను ప్రోత్సహించే లక్ష్యంతో పని చేస్తున్నట్టు మంత్రికి వివరించారు. సోలార్ ఫోన్, ఛార్జర్, వాటర్ బాటిల్స్ వ్యర్థాలతో బ్యాగుల తయారీ, అరటిపండు తొక్కతో శాలువా, హెర్బల్ శానిటరీ న్యాప్కిన్స్ వంటి ఆవిష్కరణలను మంత్రి పరిశీలించారు.
Updated Date - Feb 20 , 2025 | 02:41 AM