IT Minister Nara Lokesh : గ్లోబల్ టెక్నాలజీ హబ్గా ఏపీ
ABN, Publish Date - Jan 09 , 2025 | 06:00 AM
గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ మారనుందని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. డీప్ టెక్ నైపుణ్య ఫౌండేషన్, ఏపీ
విశాఖపట్నం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ మారనుందని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. డీప్ టెక్ నైపుణ్య ఫౌండేషన్, ఏపీ డిజిటల్ టెక్నాలజీ లీడర్షిప్ ఫోరం విశాఖలో నిర్వహిస్తున్న రెండు రోజుల ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు-2025ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచానికే తలమానికంగా నిలిచే డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందన్నారు. స్వర్ణాంధ్ర-2047లో భాగంగా 2ట్రిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యంతో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నామన్నారు. ఇన్నోవేషన్, డీప్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంచుకుంటే ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక పురోగతి సాధ్యపడుతుందన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో విశాఖలో ఏర్పాటుచేసిన మెడ్టెక్ పార్కు వైపు ప్రపంచమంతా చూస్తోందని, ఇది ఎంతో గర్వకారణమని అన్నారు. ఏఐ వర్సిటీని విశాఖలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు 21 రోజుల్లోనే అనుమతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాలను కూడా మారుస్తామని లోకేశ్ చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నిపుణులను విద్యాసంస్థలు అందించలేకపోతున్నాయని, ఈ అంతరాన్ని పూడుస్తామని చెప్పారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఏపీ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉందని, దీనిని మూడో స్థానానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డ్రోన్లను కొందరు మిస్సైళ్లను చేరవేయడానికి ఉపయోగిస్తుంటే ఏపీ ప్రభుత్వం విపత్తు సహాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తోందన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో కియా మోటార్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు ఆ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలతో తలసరి ఆదాయంలో పోటీ పడుతోందన్నారు. కర్నూలును పునరుత్పాదక ఇంధన కేంద్రంగా, చిత్తూరు, కడపను ఎలక్ర్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా, గోదావరి జిల్లాలను ఆక్వా హబ్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ పార్క్ ఉత్తరాంధ్రలో రాబోతుందన్నారు.
పారిశ్రామికవేత్తలకు బాసట..
పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని లోకేశ్ అన్నారు. స్టార్టప్లను ప్రోత్సహించడానికి బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించామని తెలిపారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ, విశాఖలో ఐటీ అభివృద్ధికి అవసరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామన్నారు. పరిశోధన, అభివృద్ధి రంగాలపై ఎక్కువ దృష్టి సారించాలని సూచించారు.
Updated Date - Jan 09 , 2025 | 06:00 AM