69.92 శాతం నమోదు
ABN, Publish Date - Feb 28 , 2025 | 12:31 AM
జిల్లా వ్యాప్తంగా 63,114 మంది ఓటర్లు ఉంటే 44,131 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 69.92గా నమోదైంది. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ముగిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు
-గుంటూరుకు బ్యాలెట్ బాక్సుల తరలింపు
-ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
-పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది.
జిల్లా వ్యాప్తంగా 63,114 మంది ఓటర్లు ఉంటే 44,131 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 69.92గా నమోదైంది. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: జిల్లాలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకు నేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటలకు 12.45 శాతంగా పోలింగ్ నమోదు అయ్యింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓటర్లు భారీగా తరలివచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లాలో 69.92శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూటమి ప్రభుత్వం బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరఫున కూటమి నాయకులు, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు తరఫున కమ్యూనిస్టులు, వైసీపీ నాయకులు స్లిప్లు రాసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరికి ఓట్లువేశారనే అంశంపై చర్చ జరుగుతోంది, వీరి ఓట్లే ప్రధాన పోటీలో ఉన్న కూటమి, పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కలెక్టర్ పర్యవేక్షణ
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ బాలాజీ పర్యటించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి డీఆర్వో కె.చంద్రశేఖరరావుతో కలసి పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులను గమనిస్తూ అధికారులు, పోలీసులకు సూచనలు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొల్లు, కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నం హిందూ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు, ఎక్సైజ్శాఖ మంత్రికొల్లు రవీంద్ర తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మచిలీపట్నంలోని హైనీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి కలెక్టర్ బాలాజీ సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మచిలీపట్నం హిందూ కళాశాల, పెడన తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి పోలింగ్ సరళిపై ఆరా తీశారు.
బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
జిల్లాలో ఎస్పీ ఆర్.గంగాధరరావు పర్యటించారు. కంకిపాడు, ఉయ్యూరు. పామర్రు, మచిలీపట్నం, గూడూరు తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బందోబస్తుపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏఎస్పీ వీవీ నాయుడు గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లో, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ అవనిగడ్డ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
పోలైన ఓట్లు 44,131
జిల్లాలో 63,114 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం నాలుగు గంటలకు 44,131 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 25,028 మంది, మహిళా ఓటర్లు 19,103 మంది ఉన్నారు.
Updated Date - Feb 28 , 2025 | 12:31 AM