ఓపీ విభాగంలో పైసా వసూల్
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:55 PM
ప్రభుత్వ ఆస్పత్రిలో వసూల్ రాజాలు ఎక్కు వయ్యారు. వైద్యం కోసం వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ దందా సాగిస్తున్నారు. ఓపీ చీటి ఇవ్వాలంటే రూ.10 చెల్లించాల్సిం దేనని రోగులను డిమాండ్ చేస్తున్నారు.
షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో ఉద్యోగుల చేతివాటం
రూ. 10 ఇస్తేనే రోగులకు ఓపీ చీటి
ఆయాలు, అటెండర్లదీ ఇదే తీరు
గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్
ప్రభుత్వ ఆస్పత్రిలో వసూల్ రాజాలు ఎక్కు వయ్యారు. వైద్యం కోసం వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ దందా సాగిస్తున్నారు. ఓపీ చీటి ఇవ్వాలంటే రూ.10 చెల్లించాల్సిం దేనని రోగులను డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాన్పుల కోసం వచ్చే వారిని కూడా వదలడం లేదు. గర్భిణులకు సహాయం అందించేందుకు అటెండర్లు, ఆయాలు పైసలు అడుగుతూ పీడిస్తున్నారు. ప్రైవేటులో వైద్యం ఖర్చులు భరించలేక సర్కార్ దవాఖానాకు వస్తే అడుగడుగునా డబ్బులు వసూలుపై తలలు పట్టుకుంటున్నారు.
షాద్నగర్, డిసెంబరు 30: షాద్నగర్ పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్రికి రోజుకూ 400 నుంచి 500 మంది రోగులు వస్తుంటారు. వారు ముందుగా అవుట్ పేషెంట్ విభాగంలో ఓపీ చీటి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ చీటీని ఇవ్వడానికి అవుట్ పేషెంట్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు రోగుల నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. అలాగైతేనే ఓపీ చిట్టి రాసిస్తామని కండీషన్ పెడుతున్నారు. తమ వద్ద డబ్బులు లేవంటే వారిని గంటల తరబడి నిలబెడుతున్నారు. ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడమేమిటని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాహకం
కమ్యూనిటీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇలా రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గతంలో టీబీ సంబంధిత వ్యాధులకు రోగుల నుంచి రూ.5 తీసుకునే వారని, ఈ విధానాన్ని గత ప్రభుత్వాలు ఎప్పుడో రద్దు చేశాయని వారు తెలిపారు. కానీ ఓపీ సేవలు అందించే ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ పాత పద్ధతినే అవలంబిస్తున్నారని ఆస్పత్రి వర్గాలే చెప్పడం గమనార్హం.
మెమో జారీ చేశాం
డబ్బులు వసూలు చేస్తున్న సదరు ఉద్యోగికి మెమో జారీ చేశాం. గతంలో టీబీ సీల్స్ కోసం రూ. 5 చెల్లించాల్సిన అవసరం ఉండేది. ఎవరివద్ద డబ్బులు వసూలు చేయవద్దని సిబ్బందిని ఆదేశించాను. కాన్పుల కోసం వచ్చే కుటుంబ సభ్యులను పైసలు డిమాండ్ చేయొద్దని ఆయాలను హెచ్చరించాను. ఇక నుంచి ఆస్పత్రి సిబ్బంది రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా పైసలు అడిగితే నాకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటా.
- డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, సూపరింటెండెంట్
Updated Date - Dec 30 , 2024 | 11:55 PM