వెనుక‘బడి’!
ABN, Publish Date - Jan 18 , 2024 | 04:05 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం గ్రేటర్ పరిధిలో నత్తనడకన సాగుతోంది.
నిలిచిన ‘మన ఊరు-మన బడి’ పనులు
పలు స్కూళ్లలో 65శాతం మాత్రమే పూర్తి
బిల్లులు రాలేదని వదిలేసిన కాంట్రాక్టర్లు
పట్టించుకోని అధికారులు
ఇబ్బందుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు
హైదరాబాద్ సిటీ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం గ్రేటర్ పరిధిలో నత్తనడకన సాగుతోంది. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు పనులను పూర్తి చేసి విద్యార్థులకు నూతన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పారు. కానీ చాలా పాఠశాలల్లో నేటికీ ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నప్పటికీ ప్రతిపాదిత పనులను పూర్తి చేయలేకపోయారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపిక చేసిన చాలా స్కూళ్లలో ఇప్పటివరకు 65 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. మొదటి విడతలో భాగంగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 239, రంగారెడ్డిలో 464, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 176 పాఠశాలలను అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. ఈ మేరకు తరగతి గదులు, ఆడిటోరియం, ప్రహరీల నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదించడంతో రూ.25 నుంచి రూ.35 లక్షల వరకు నిధులు మంజూరు చేసింది. మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుత్ కనెక్షన్లు, నీటి సరఫరా, ఫర్నిచర్ ఏర్పాటుకు రూ.15 నుంచి రూ.16 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. కార్యక్రమంలో మొత్తం 12 రకాల పనులను చేపట్టేందుకు నిర్ణయించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మొదట్లోనే కాంట్రాక్టర్లు మొక్కుబడిగా పనులను ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయో రావో అన్న అనుమానంతో చాలామంది కాంట్రాక్టర్లు ఆలస్యంగా మొదలుపెట్టారు.
అర్ధంతంరగా పనులు ఆగిన పాఠశాలలు
బోయినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్లాబు, మరుగుదొడ్ల మరమ్మతుతోపాటు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.18 లక్షలు కేటాయించారు. అయితే పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ తొలుత మరుగుదొడ్లపై రేకులు తొలగించి అలాగే వదిలేశాడు. నిర్మాణానికి తీసుకొచ్చిన సామగ్రిని పాఠశాలలో వదిలేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయితే బిల్లుల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అతడికి నచ్చజెప్పగా ఇప్పటివరకు 65 శాతం పనులు పూర్తిచేశాడు. ముషీరాబాద్ పాఠశాలలో చేపట్టిన ప్రహరీ, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తదితర పనుల్లో 40 శాతం పెండింగ్లో ఉన్నాయి. రాజేంద్రనగర్ మండలం హైదర్గూడ మండల పరిషత్ కేంద్ర ప్రాథమిక పాఠశాలకు రూ.15.58 లక్షలను కేటాయించారు. ఇందులో గతంలో స్లాబు వేసి ఉన్న భవనంలో గదుల నిర్మాణంతోపాటు మరుగుదొడ్ల మరమ్మతు చేపట్టేందుకు నిర్ణయించారు. అయితే గతేడాది మే నెలలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ కేవలం పాత భవనం స్లాబుకు చిన్నపాటి మరమ్మతులు మాత్రమే చేసి బిల్లులు రావడంలేదంటూ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పనులను పురోగతిలోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తికాగా ఫ్లోరింగ్, ప్రహరీ పనులు చేయాల్సి ఉంది. అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు రూ.86 లక్షలు కేటాయించారు. 680 మంది విద్యార్థులున్న ఈ స్కూల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ, డైనింగ్ హాల్, విద్యుత్ కనెక్షన్లు, మరుగుదొడ్లకు నీటి సరఫరా, బెంచీలు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రతిపాదించారు. మొత్తం రూ.86 లక్షల విలువైన పనుల్లో రూ.30 లక్షలలోపు పనులకు మాత్రమే టెండర్లు పిలిచారు. ఆయా పనులను నాలుగు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు కనీసం 55శాతం పనులు కూడా పూర్తి చేయించకపోవడం గమనార్హం.
21 చోట్ల మాత్రమే..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో గుర్తించిన 239 స్కూళ్లలో గతేడాది జూన్ 20న కేవలం 21 భవనాలను మాత్రమే ప్రారంభించారు. గోషామహాల్ నియోజకవర్గంలోని కుచిచిరాగల్లీ, చాదర్ఘాట్ బాలుర పాఠశాల-2, నాంపల్లి బాలుర పాఠశాల, గోషామహాల్ బాలుర ప్రాథమిక పాఠశాల, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జీహెచ్ఎ్స అమీర్పేట్-1, కార్వాన్ నియోజకవర్గంలోని లంగర్హౌజ్ ప్రాథమిక పాఠశాల, ఖైరతాబాద్లోని నారాయణగూడ ప్రాథమిక పాఠశాల, హైదర్గూడ సెయింట్ పీటర్స్ హైస్కూల్, ఫిల్మ్నగర్లోని ఎంఆర్సీకాలనీ ప్రాథమిక, మలక్పేట్ నియోజకవర్గంలోని మలక్పేట్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, ఓల్డ్ మలక్పేట్, అంబర్పేట్లోని దోబిగల్లీ ప్రాథమిక, నాంపల్లిలోని విజయ్నగర్కాలనీ ప్రాథమిక, సనత్నగర్ నియోజకవర్గంలోని అంబర్పేట్ , అమీర్పేట్, భన్సీలాల్పేట్, కవాడిగూడ ఉందా ఈశ్వరయ్య మెమోరియల్, సికింద్రాబాద్లోని చిలకలగూడ ప్రాథమిక, ఎంపీబాగ్ హైస్కూల్, లాలాపేట్ హైస్కూల్, మార్కెట్ లాలాపేట్లో చేపట్టిన భవనాలను ప్రారంభించారు.
కొత్త ప్రభుత్వంపై ఆశలు
రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతీ పంచాయతీ పరిధిలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని స్కూళ్లలో నిలిచిన మన ఊరు-మన బడి పనుల పురోగతిపై ఆసక్తి నెలకొంది. నిధుల కొరతతో గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన పనులను పూర్తి చేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. పనులు మధ్యలోనే ఆగిపోయిన పాఠశాలల్లో విధ్యార్థులు ఆరుబయటనే పాఠాలు వినాల్సి వస్తోందన్నారు. ఈ ప్రభుత్వమైనా సకాలంలో నిధులు మంజూరు చేసి పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Jan 19 , 2024 | 07:40 AM