New books for Anganwadi Centres: ఐదేళ్ల తరువాత..
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:34 PM
New books for Anganwadi Centres: గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. సౌకర్యాలు దేవుడెరుగు కనీసం చిన్నారులకు అవసరమైన పుస్తకాలు, పలకలను కూడా పంపిణీ చేయలేదు.
-బోధనకు తొలగిన అడ్డంకులు
హిరమండలం, డిసెంబరు 30: (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. సౌకర్యాలు దేవుడెరుగు కనీసం చిన్నారులకు అవసరమైన పుస్తకాలు, పలకలను కూడా పంపిణీ చేయలేదు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు పాత పుస్తకాలు, పలకలతోనే ఐదేళ్లూ నెట్టుకొచ్చారు. వాటితో పిల్లలకు బోధించేందుకు ఇబ్బందుల పడేవారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి ఇబ్బందులు తొలగాయి. ఐదేళ్ల తరువాత అంగన్వాడీ కేంద్రాలకు కొత్త పుస్తకాలు వచ్చాయి. ఫలితంగా చిన్నారుల బోధనకు అడ్డంకులు తొలగాయి.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 16 ప్రాజెక్టుల పరిధిలో 3,358 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రసుత్తం పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులను ప్రీ ప్రైమరీ-1, మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలను పీపీ-2గా విభజించి పాఠాలు బోధిస్తున్నారు. గతంలో పీపీ-2 విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఐదు చొప్పున అందిస్తున్నారు. వీటిలో తెలుగు అక్షరాలతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్లో ఆంగ్ల అక్షరాలు, బొమ్మలు గీయడం, ఆటపాటలతో పద్యాలు, ఆకట్టుకునే బొమ్మలు వంటి పుస్తకాలు ఉన్నాయి.
సృజనాత్మకతను వెలికితీసేలా..
గత వైసీపీ ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యలోనే చిన్నారులకు మాతృభాషను దూరం చేసింది. కేవలం ఆంగ్లంలో మాత్రమే పుస్తకాలు ఉండేవి. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చిన్నారుల్లో సృజనాత్మకత వెలికితీసేలా కొత్త పుస్తకాలను పంపిణీ చేసింది. ఆంగ్లతో పాటు తెలుగు భాష గొప్పదనాన్ని చిన్నారులకు అందించాలనే లక్ష్యంతో తెలుగు అభ్యాస దీపిక అందించేం దుకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల చిన్నారుల్లో మరింత విజ్ఞానం పెంపొందించేందుకు అవకాశం ఏర్పడింది.
Updated Date - Dec 30 , 2024 | 11:34 PM