కారణాలు చెప్పకుండా జరిమానా విధింపు చెల్లదు
ABN, Publish Date - Oct 12 , 2024 | 04:14 AM
ఆదాయ పన్ను చట్టనిబంధనలకు విరుద్ధంగా నగదు రూపంలో రుణాలు, డిపాజిట్లు సేకరించారని నిర్ధారిస్తూ జరిమానా విధించే క్రమంలో సంబంధిత అసెసింగ్ అధికారి జారీ చేసే ఉత్తర్వుల్లో సంతృప్తికర కారణాలు పేర్కొనాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఐటీ అధికారులకు హైకోర్టు స్పష్టీకరణ
జాయింట్ కమిషనర్ ఉత్తర్వులు రద్దు
అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆదాయ పన్ను చట్టనిబంధనలకు విరుద్ధంగా నగదు రూపంలో రుణాలు, డిపాజిట్లు సేకరించారని నిర్ధారిస్తూ జరిమానా విధించే క్రమంలో సంబంధిత అసెసింగ్ అధికారి జారీ చేసే ఉత్తర్వుల్లో సంతృప్తికర కారణాలు పేర్కొనాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్ట ఉల్లంఘనలు, కారణాలు చెప్పకుండా చట్టంలోని 271డీ సెక్షన్ కింద.. సేకరించిన మొత్తానికి సమానంగా జరిమానా విధిస్తూ ఇచ్చే ఉత్తర్వులు చెల్లుబాటు కావని పేర్కొంది. తగిన కారణాలు రికార్డు చేయకుండా జరిమానా విధించేందుకు ఫైలు పంపినప్పటికీ దాని ఆధారంగా జాయింట్ కమిషనర్ జరిమానా విధించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సంబంధిత ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. అమరేంద్ర అనే వ్యాపారి రూ6.65 కోట్ల రుణాలను నగదు రూపంలో సేకరించి ఐటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ.. అంతే మొత్తాన్ని జరిమానాగా విధిస్తూ ఐటీ శాఖ జాయింట్ కమిషనర్ గత నవంబరులో ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని అమరేంద్ర హైకోర్టులో సవాల్ చేశారు.
ఆయన తరఫు న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపిస్తూ.. జరిమానా విధించేందుకు అసెసింగ్ అధికారి తన ఉత్తర్వుల్లో సంతృప్తికర కారణాలు పేర్కొనలేదని తెలిపారు. నగదు రూపంలో సొమ్ము సేకరించలేదని పిటిషనర్ ఇచ్చిన వివరణను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అయితే జాయింట్ కమిషనర్ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే వాటిని సవాల్ చేసుకునేందుకు ప్రత్యామ్నాయం ఉందని.. నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని ఐటీ శాఖ తరఫున సీనియర్ న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అసెసింగ్ అధికారి తన ఉత్తర్వుల్లో తగిన కారణాలు పేర్కొననప్పటికీ, జాయింట్ కమిషనర్ పిటిషనర్కు రూ.6.65 కోట్ల జరిమానా విధించడాన్ని తప్పుబట్టింది. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
Updated Date - Oct 12 , 2024 | 04:14 AM