Dadi Veerabhadra Rao: జగన్ పెద్ద నియంత.. 60 రోజుల్లో ఇంటికే..
ABN, Publish Date - Feb 14 , 2024 | 12:44 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కోపంతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని.. 4వ రాజధాని హైదరాబాద్ అనడం పెద్ద కుట్ర అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు పేర్కొన్నారు.
విశాఖ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కోపంతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని.. 4వ రాజధాని హైదరాబాద్ అనడం పెద్ద కుట్ర అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు పేర్కొన్నారు. విశాఖను రాజధాని చేసే వరకూ హైదారాబాద్ రాజధాని కావాలనడం. ఏపీ, తెలంగాణ మధ్య అగ్గి రాజువేయడానికేనన్నారు. సుబ్బారెడ్డితో సీఎం జగనే ఈ చిలక పలుకులు పలికించారన్నారు. సుబ్బారెడ్డి లాంటి మేధావులు వలన వైసీపీకి నష్టం జరుగుతుందని దాడి పేర్కొన్నారు.
హైదరాబాద్ రాజధాని కావాలనడం.. తెలుగు రాష్ట్రాలలో అశాంతి రాజేయడానికేనని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవంతో వైసీపీ ఆటలు ఆడుతోందన్నారు. మతి భ్రమించి మాట్లాడినట్లు.. సుబ్బారెడ్డి మాటలు ఉన్నాయన్నారు. ఏపీ ప్రజలను మభ్య పెట్టదానికేనా ఈ ప్రకటనలని దాడి ప్రశ్నించారు. పరిపాలన రాజధాని అని చెప్పడంతో.. విశాఖలో భూముల రేట్లు పెరిగాయన్నారు. సీఎం జగన్ మూడు రాజధానులు అన్నారని.. ఎక్కడా అభివృద్ధి చేయలేదని.. ఒక ఇటుక కూడా వేయలేదన్నారు. మూడు ప్రాంతాల వారిని జగన్ మోసం చేశారని.. రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని దాడి పేర్కొన్నారు. జగన్ ఒక పెద్ద నియంత.. 60 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతారన్నారు. ఐదేళ్లు నుంచి ఏపీ ప్రజలతో జగన్ ఆడుకుంటున్నారని.. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా అంటున్నారు అంతేనన్నారు. బటన్ నొక్కడానికి సీఎం జగన్ అవసరం లేదని.. జగన్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా... వైసీపీకి ఓటమి తప్పదని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు.
Updated Date - Feb 14 , 2024 | 12:44 PM