TJS Chief: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కోదండరాం అనుమానాలు
ABN, First Publish Date - 2023-03-18T13:17:27+05:30
టీఎస్పీఎస్పీ ప్రశ్నా పత్రం లీకేజీ అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం స్పష్టం చేశారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్పీ ప్రశ్నా పత్రం లీకేజీ (TSPSC Paper Leakage) అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం (TJS chief Kodandaram) స్పష్టం చేశారు. శనివారం ఉదయం గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కోదండరాం దీక్షకు దిగారు. పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పార్టీలతో కలిసి పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పేపర్ లీక్ ఒక వ్యక్తే చేశాడని అనుకోలేమని... ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
పేపర్ రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. మళ్ళీ క్వాలిఫై అవుతామో లేదో అంటూ ఆవేదన చెందుతున్నారని తెలిపారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ (TSPSC) ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నైతిక బాధ్యత ఉందని చెప్పారు. నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది జీవితాలతో అడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏళ్ల తరువాత తెలంగాణ (Telangana)ను లీకుల రాజ్యం, లిక్కర్ రాజ్యంగా మార్చారన్నారు. టీఎస్పీఎస్పీలో సమగ్ర ప్రక్షాళన జరగాలన్నారు. లీకేజీ అంశంలో డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాలో సదస్సులు నిర్వహించనున్నట్లు కోదండరాం వెల్లడించారు.
Updated Date - 2023-03-18T14:19:43+05:30 IST