TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక భేటీ...
ABN, First Publish Date - 2023-03-14T15:29:45+05:30
టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజ్ (TSPSC Exam Paper Leakage) వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. లీకేజీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana Public Service Commission) కీలక భేటీ నిర్వహించింది. సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి (Service Commission Chairman Janardhan Reddy) అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీపై కమిషన్ చర్చిస్తోంది. ఏఈ పరీక్ష రద్దు చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ వన్ పరీక్షపై వస్తున్న అనుమానాలను కమిషన్ పరిశీలిస్తోంది. ప్రవీణ్ ఎగ్జామ్ సమయంలో వ్యవహరించిన తీరు, అతడి పేపర్పై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పరీక్షా పేపర్ లీకేజీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. కమిషన్ సమావేశం అనంతరం మీడియా ప్రకటన విడుదలకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ సమావేశం తరువాత సీఎస్తో బోర్డ్ల సమావేశం జరుగనుంది.
టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్తత...
మరోవైపు ఈరోజు ఉదయం బీజేవైఎం నేతలు, యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళనలతో టీఎస్పీఎస్సీ కార్యాలయం (TSPSC Office) దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీజేవైఎం (BJYM) కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ (Youth Congress) కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఎగ్జామ్ పేపర్ లీక్ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు (BJP) భారీ ఆందోళనకు దిగాయి. టీఎస్పీఎస్సీ బోర్డును ధ్వంసం చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేవైఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. సిట్టింగ్ జడ్జితో విచారణకు బీజేవైఎం డిమాండ్ చేసింది. మరోవైపు యూత్ కాంగ్రెస్ కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించింది. కార్యాలయం లోపలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు.
ఓయూలో ఆందోళన...
అటు ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లోనూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజపై ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. ఓయూ రెడ్డుపై విద్యార్థులు భైఠాయించి ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిరుద్యోగ విద్యార్థులతో చెలగాటం ఆడిన టీఎస్పీఎస్సీ చైర్మన్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు.
గ్రూప్ 1 ప్రీమిమ్స్ పేపర్ లీక్ అయినట్లు అనుమానాలు?
గ్రూప్ 1 ప్రీమిమ్స్ పేపర్ ప్రవీణ్ రాసినందున... ఆ పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ గ్రూప్-1 రాయగా 103 మార్కులు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో గ్రూప్ -1 పేపర్ కూడా లీక్ అయినట్టు నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏఈ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్పై మరిన్ని అభియోగాలు వచ్చిపడుతున్నాయి. ఇంకెన్ని పేపర్లు లీక్ చేశాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్తో పని చేస్తూనే ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగాయి. అయితే రాంగ్ బబ్లింగ్ కారణంగా డిస్క్వాలిఫై అయ్యాడని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా... ప్రిలిమినరీ కీ తో ఓఎమ్మార్ షీట్ చెక్ చేసినప్పుడు ప్రవీణ్కు 103 మార్కులు వచ్చాయని ప్రచారం జరిగింది. తాను రాసిన పరీక్ష పేపర్లు కూడా లీక్ చేసి ఉంటాడని అనుమానాలు వెల్లువెత్తున్నాయి. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ ఫోన్, ల్యాప్ టాప్ డాటా ఆధారంగానే లీకేజీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రవీణ్పై వేటు..
మరోవైపు లీకేజీకి కారకుడైన ప్రవీణ్పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేటు వేసింది. ప్రవీణ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో ఉద్యోగి రాజశేఖర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పేపర్ లీకేజీలో ఈ ఇద్దరు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-03-14T15:38:35+05:30 IST