Hyderabad: 12 రోజుల్లో 12 రాష్ట్రాలు.. శ్రీనగర్ టు కన్యాకుమారి వరకు
ABN, First Publish Date - 2023-02-25T14:11:37+05:30
మహిళల ప్రత్యేక సోలో కేటగీరి సైక్లింగ్ రేసులో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్ సైకిల్ రైడ్ని పూర్తిచేస్తానని డిఫరెంట్లీ ఏబుల్డ్ సూపర్ రాండోనూర్ గీతా ఎస్. రావు ధీమా వ్యక్తంచేశారు.
బంజారాహిల్స్, ఆంధ్రజ్యోతి: మహిళల ప్రత్యేక సోలో కేటగీరి సైక్లింగ్ రేసులో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్ సైకిల్ రైడ్ని పూర్తిచేస్తానని డిఫరెంట్లీ ఏబుల్డ్ సూపర్ రాండోనూర్ గీతా ఎస్. రావు ధీమా వ్యక్తంచేశారు. ఎడమ కాలిలో పోలియో ఉన్నప్పటికీ ఆమె ఒక కాలుతోనే పుష్ చేస్తూ.. సైకిల్ నడుపుతూ ఇప్పటికే డీఎస్ఆర్, ఒలింపిక్ ట్రై అథ్లెట్, పారా సైక్లింగ్ 2022 చాంపియన్గా నిలిచింది. సుషేనా హెల్త్ ఫౌండేషన్ టీం సభ్యులను కలిసేందుకు శుక్రవారం ఆమె నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె నిలోఫర్, ఈఎస్ఐ నిర్వహిస్తున్న ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఐకానిక్ సైకిల్ రేస్ శ్రీనగర్లో మొదలై తమిళనాడులోని కన్యాకుమారిలో ముగుస్తుందన్నారు.
12 రోజుల్లో 12 రాష్ర్టాలను దాటుతూ 3,651 కిలోమీటర్లను పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తన రేస్లో భాగంగా తల్లిపాలే ఉత్తమ ఆహారం అనే నినాదంతో దేశంలో తల్లిపాల అవగాహనను పెంచడానికి ప్రచారం చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఉషారాణి, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సంతో్షకుమార్ క్రాలేటి, నియోనాటాలజీ హెచ్ఓడీ అలిమేలు మాదిరెడ్డి, సుషేనా హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డా. కలవలపల్లి దుర్గాభవాని, అధ్యక్షుడు డా. శ్రీనివాస్ ముర్కి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-25T14:12:01+05:30 IST