Hyderabad: బస్సులన్నీ ఫుల్.. ఉచిత ప్రయాణంతో 100 శాతం ఆక్యుపెన్సీ
ABN, Publish Date - Dec 20 , 2023 | 10:34 AM
సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో 100 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యింది. గ్రేటర్జోన్ ఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయిలో సోమవారం ఒక్కరోజే 20.5లక్షల మంది
- సోమవారం 20.5 లక్షల మంది ప్రయాణాలు
- వారిలో మహాలక్ష్మి జీరో టికెట్లు 13 లక్షలు
- బస్సులు పెంచే యోచనలో ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో 100 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యింది. గ్రేటర్జోన్ ఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయిలో సోమవారం ఒక్కరోజే 20.5లక్షల మంది ప్రయాణాలు సాగించారు. వారిలో ‘మహాలక్ష్మి’ జీరో టికెట్లతో 13లక్షల మంది ప్రయాణించగా 7.5లక్షల మంది టికెట్లతో ప్రయాణించారు. టికెట్లతోపాటు జీరో టికెట్లకు వచ్చే ఆదాయంతో మొత్తంగా గ్రేటర్జోన్ ఆర్టీసీ ఆదాయం రూ.5.86 కోట్లుగా నమోదయిందని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణంతో భారీగా పెరిగిన ప్రయాణికుల లెక్కలు ప్రభుత్వానికి వివరించి కొత్తబస్సులు అందుబాటులోకి తెచ్చేదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సిటీ బస్సుల్లో టికెట్లు, పాస్లతో రోజువారీ ప్రయాణాలు సాగిస్తున్న ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ దృష్టిసారించింది. ఉదయం, సాయంత్రం రద్దీ రూట్లలో మహిళా ప్రత్యేక సర్వీసుల సంఖ్య పెంచడంతోపాటు టికెట్ల ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పెరిగిన ప్రయాణికులు
కొవిడ్ తర్వాత నుంచి గ్రేటర్జోన్లో 2,800 ఆర్టీసీ బస్సులు తిరుగు తుండగా రోజువారీగా 18లక్షలమంది ప్రయాణిస్తున్నారు. ‘మహాలక్ష్మి’ జీరో టికెట్లతో వారి సంఖ్య భారీగా పెరిగి 65-70శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 100శాతానికి చేరిందని ఉన్నతాధికారులు తెలిపారు.
Updated Date - Dec 20 , 2023 | 10:34 AM