కంత్రీ కరోనా
ABN, Publish Date - Dec 23 , 2023 | 03:48 PM
తగ్గినట్లే తగ్గిన కొవిడ్ మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది.
మళ్లీ జడలు విప్పుతున్న మహమ్మారి
నగరంలో క్రమంగా పెరుగుతున్న కేసులు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు
ఆస్పత్రుల్లో ప్రత్యేక కొవిడ్ వార్డులు సిద్ధం
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా చర్యలు
ఈసారి పిల్లలపై ప్రభావం చూపే చాన్స్
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): తగ్గినట్లే తగ్గిన కొవిడ్ మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. అడపాదడపా నమోదవుతున్న కేసులు కొద్దిరోజులుగా పెరుగుతున్నాయి. ఈ కేసుల సంఖ్య భయపెడుతోంది. నిన్నటివరకు దేశవ్యాప్తంగా 640 కేసులు నమోదవగా ఒకరు మృతిచెందారు. మొత్తంగా నేటివరకు 2,997 కేసులు యాక్టివ్లో ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికి 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో ముగిసిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నిలోఫర్లో న్యుమోనియాతో బాధపడుతున్న 14 నెలల బాలుడికి పరీక్షలు జరపగా కొవిడ్ నిర్ఱారణ అయిందని, ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అప్పటికే మరో చిన్నారి అక్కడ చికిత్స పొందుతోంది.
కేసుల్లో పెరుగుదల
ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానాల్లో వారం, రెండు వారాలుగా ఓపీకి వచ్చే కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు కొవిడ్ కేసులు తగ్గడంతో ఎక్కడికక్కడే వైరస్ నిర్దారణ పరీక్షలు చేయడం నిలిపివేశారు. మళ్లీ కొవిడ్ వైరస్ ప్రబావంతో పరీక్షలు షురూ చేశారు. కానీ ఎవరినీ ఇంతవరకు ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. ప్రస్తుతం ఓపిలోనే చికిత్సలు పొందుతున్నారు. అయితే ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్లో 25 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిలోఫర్ ఆస్పత్రిలో రెండు నెలల శిశువు, మరో 14 నెలల బాలుడికి కొవిడ్ సోకడంతో వారికి ప్రత్యేక వార్డులో చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ నిర్దారణ పరీక్షలు చేయడం పెంచినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కొత్త సబ్ వేరియంట్ జేఎన్-1 ఉనికి ఉందా లేదా అనేది ఇప్పుడే కచ్చితంగా నిర్దారణకు రాలేమని, కొద్ది రోజులు గడిస్తే కానీ పరిస్థితి స్పష్టం కాదని అంటున్నారు. కేరళ, ఉత్తరప్రదేశ్ల్లో కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. ఒక్కొక్క ఆస్పత్రిలో ఒక్కొక్క రకంగా వారం, పది రోజుల నుంచి మైల్డ్ కేసులు చూస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కొంతమంది కరోనా లక్షణాలు కనిపించడంతో ఎవరికి వారే ముందుగానే పరీక్షలు చేయించుకుని ఆస్పత్రికి వైద్యుల సలహాల కోసం వస్తున్నారు. పాజిటివ్ అని తేలిన వ్యక్తులు స్వల్ప లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రులకు వచ్చే కేసులన్నీ మైల్డ్గా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
గాంధీ మెడికల్ కాలేజీ పర్యవేక్షణలో జేఎన్-1 పరీక్షలు
కొత్త సబ్ వేరియంట్ వైరస్ నిర్ధారణ పరీక్షలను గాంధీ మెడికల్ కాలేజీ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.కొవిడ్ పాజిటివ్ అని నిర్దారణ అయిన వారి నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రి ల్యాబ్కు పంపిస్తున్నారు. కొవిడ్ పరీక్షలు మాత్రం ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిర్వహిస్తున్నారు.
ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు
కొవిడ్ కొత్త వేరియంట్ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, పడకలు ఏర్పాటు చేశారు. గాంధీ, ఉస్మానియా, చెస్ట్, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రుల్లో వార్డులు ఏర్పాటు చేశారు. గాంధీలో 50, చెస్ట్ ఆస్పత్రిలో 20, ఫీవర్ ఆస్పత్రిలో 20, ఉస్మానియా ఆస్పత్రిలో 5, నిలోఫర్ ఆస్పత్రిలో 20 పడకలను సిద్దం చేశారు.
Updated Date - Dec 23 , 2023 | 03:48 PM