కేడర్కో రేటు.. లీడర్కో రేటు
ABN, First Publish Date - 2023-11-10T15:45:29+05:30
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అవకాశం రాలేదనో.. అభ్యర్థిత్వం నచ్చని వారికి ఇచ్చారనో.. పెద్ద సంఖ్యలో నేతలు పార్టీలు వీడుతున్నారు.
కాసులిచ్చి కండువా కప్పుతున్న నేతలు
రూ.50వేల నుంచి రూ.10 లక్షలకుపైమాటే
ప్రత్యర్థులు బలహీనపడేలా చేరికల వ్యూహం
ప్యాకేజీ చేరికలతో పరేషాన్లో అభ్యర్థులు!
పోలింగ్ వరకు ఉంటారా లేదా అన్న సంశయం
హైదరాబాద్ సిటీ, నవంబర్ 10(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అవకాశం రాలేదనో.. అభ్యర్థిత్వం నచ్చని వారికి ఇచ్చారనో.. పెద్ద సంఖ్యలో నేతలు పార్టీలు వీడుతున్నారు. వేచి చూసేది లేదు.. సహకరించేది లేదంటూ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు పలువరు నాయకులు అమితాసక్తి చూపుతున్నారు. కొందరు నాయకుల మెడలో ఏ రోజు ఏ పార్టీ కండువా ఉంటుందో అనుచరులు కూడా చెప్పలేని పరిస్థితి. ఇదే దారిలో నియోజకవర్గం, డివిజన్ స్థాయి నాయకులు నడుస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు నియోజక వర్గాల్లో చేరికల జాతర సాగుతోంది. అభ్యర్థులూ చేరికలకు అధిక ప్రాధాన్యతనిస్తుండడం.. అందుకు తగ్గ ప్రతిఫలమూ ఉంటుండడంతో పార్టీలు మారేందుకు నాయకులు, కార్యకర్తలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
రూ.లక్షల్లో చెల్లింపులు
క్షేత్రస్థాయిలో పార్టీల్లో చేరికల్లో గతంతో పోలిస్తే భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతకుముందు పార్టీ లేదా అభ్యర్థి తీరు నచ్చకో.. ప్రాధాన్యత ఇవ్వడం లేదనో పార్టీలు మారేవారు. ప్రస్తుత చేరికల్లో మాత్రం కాసులు ముట్టచెబుతూ పార్టీ జెండాను కప్పుతున్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, బూత్.. నేతల స్థాయి.. వారి వెంట ఉన్న కేడర్.. బస్తీ/కాలనీలో వాళ్లు చెబితే ఎన్ని ఓట్లు పడే అవకాశముందన్నది అనే అంశాలను అంచనా వేసుకొని వారికి రేటు నిర్ణయిస్తున్నారు. దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి.. స్థానికంగా వేల సంఖ్యలో ఓట్లు వేయిస్తారనుకునే వారికి రూ.5 నుంచి రూ.10 లక్షలు.. కొందరికి అంతకంటే ఎక్కువ కూడా ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. చేరికల సమయంలో తమ బలం ప్రదర్శించేలా అధిక సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులను తీసుకెళ్తున్నారు. వారందరికీ అభ్యర్థులతో ఆయా పార్టీల కండువాలు వేయిస్తున్నారు. తమకు ముట్టిన దాంట్లో కొంత వెంట వచ్చిన వారికి ఇస్తున్నారు.
చేరికల వ్యూహం.. మదిలో టెన్షన్
చేరికల విషయంలో కొందరు అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు లేకుండా చేసి ప్రత్యర్థి పార్టీ బలహీనంగా మారిందన్న అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది వారి యోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధానంగా బస్తీలు, కాలనీల్లో జోరుగా చేరికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఓటర్లు ప్రభావితమై తమకు అనుకూలంగా మారుతారన్న భావన వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఓ నియోజకవర్గం అభ్యర్థి జాయినింగ్ల కోసం రూ.5 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు సమాచారం. డబ్బు కోసం చేరిన నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ముగిసే వరకు తమ పార్టీలో ఉంటారా లేదా అన్న సంశయం కొందరు అభ్యర్థుల్లో మొదలైంది. ప్రత్యర్థులు ప్రలోభపెడితే చివరి నిమిషంలో హ్యాండిస్తారా? అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో? ఏ అభ్యర్థి వెంట ఎవరు ప్రచారానికి వస్తారో? తెలియని పరిస్థితి.
పలు నియోజకవర్గాల్లో ఇలా..
అంబర్పేట నియోజకవర్గంలోని ఓ ప్రధాన పార్టీలో జోరుగా చేరికలు సాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలను తన వైపునకు తిప్పుకునేందుకు అభ్యర్థి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. వేల సంఖ్యలో కండువాలు ప్రత్యేకంగా ఆర్డర్ చేసి వచ్చిన వారి కల్లా కప్పుతున్నారు. పార్టీపై ప్రేమతోనో.. అభ్యర్థిపై అభిమానంతోనో జరుగుతోన్న చేరికలు నామమాత్రమే. మెజార్టీ చేరికల వెనుక ప్యాకేజీ మంత్రముందన్నది స్థానికంగా జరుగుతోన్న ప్రచారం.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వారం క్రితం భారీగా చేరికలు జరిగాయి. బేరం కుదరడంతో ప్రత్యర్థి పార్టీకి చెందిన పలువురు నాయకులు చేరారు. ఒప్పందం ప్రకారం కొంత నగదు ముందే ముట్టచెప్పిన అభ్యర్థి.. కొంత పెండింగ్లో పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కావడంతో.. మిగతా మొత్తం ఎప్పుడిస్తారంటు సదరు నాయకులు వెంబడి పడుతున్నారు. లేదంటే మరో పార్టీ చూసుకుంటామని బ్లాక్మెయిల్ సైతం చేస్తున్నారు.
ఎల్బీనగర్లో ఓ పార్టీ అభ్యర్థి చేరికలు నిలిపివేయండని పార్టీ అధిష్ఠానానికి సూచించారు. ఇప్పటికే వేలాది మంది చేరడం.. అందుకు పెద్దఎత్తున ముట్టచెప్పాల్సి రావడంతో తాత్కాలికంగా జాయినింగ్లకు బ్రేక్ ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు.
Updated Date - 2023-11-10T15:45:30+05:30 IST