Nitin Gadkari : నితిన్ గడ్కరీని బెదిరించిన గ్యాంగ్స్టర్ను గుర్తించిన పోలీసులు
ABN, First Publish Date - 2023-01-15T10:41:39+05:30
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)ని బెదిరించిన గ్యాంగ్స్టర్ను మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు.
ముంబై : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)ని బెదిరించిన గ్యాంగ్స్టర్ను మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసేందుకు కర్ణాటక వెళ్లాలని నిర్ణయించారు. ఆ వ్యక్తి బెళగావిలోని జైలులో ఉంటూ, అక్కడి ల్యాండ్లైన్ ఫోన్ను దుర్వినియోగం చేసి, గడ్కరీని బెదిరించినట్లు నాగ్పూర్ పోలీసులు తెలిపారు.
నాగ్పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నితిన్ గడ్కరీని జైలు నుంచి బెదిరించినట్లు గుర్తించామని చెప్పారు. బెళగావి జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ జయేష్ కాంతా (Jayesh Kantha) జైలులోని ఫోన్ను చట్టవిరుద్ధంగా ఉపయోగించుకున్నాడన్నారు. శనివారం ఉదయం 11.25 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలో మూడుసార్లు గడ్కరీ కార్యాలయానికి ఫోన్ చేశాడని తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బు పంపించాలని, లేదంటే గడ్కరీని చంపుతానని, నాగ్పూర్లోని ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తానని బెదిరించాడన్నారు. డబ్బు పంపించవలసిన చిరునామాతోపాటు మొబైల్ నంబరును కూడా చెప్పాడని తెలిపారు. జయేష్ ఓ హత్య కేసులో నిందితుడని, గ్యాంగ్స్టర్ అని తెలిపారు. గడ్కరీ కార్యాలయం సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-01-15T10:46:40+05:30 IST