India-Canada row: చట్ట పాలనకు కట్టుబడి ఉంటాం: జస్టిన్ ట్రూడో
ABN, First Publish Date - 2023-11-12T17:38:39+05:30
కెనడా గడ్డపై ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తన ఆరోపణలు కొనసాగించారు. తమ దేశం ఎప్పుడూ చట్ట పాలనకు కట్టుబడి ఉంటుందని అన్నారు.
ఒట్టావ: కెనడా గడ్డపై ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మరోసారి తన ఆరోపణలు కొనసాగించారు. తమ దేశం ఎప్పుడూ చట్ట పాలనకు కట్టుబడి ఉంటుందని అన్నారు. నిజ్జర్ హత్య కేసులో నిజానిజాలు తేల్చేందుకు భారత్, మిత్రదేశాలైన అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
''ఈసారి మేము దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. లా ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తమ పని తాము చేస్తుంటే మేము భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. మా దేశం ఎప్పుడూ చట్ట పాలనకు కట్టుబడి ఉంటుంది. పెద్ద దేశాలు చట్టాలను ఉల్లంఘించినప్పుడు దానిని సరిచేసుకోకుంటే అప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రమాదంలో పడతారు'' అని ట్రూడో అన్నారు.
భారత సంతతికి చెందిన పార్లమెంటేరియన్ చందన్ ఆర్య ఇటీవల భారత హైకమిషనర్ సంజీవ్ కుమార్ వర్మను ఆహ్వానించిన ఘటనపై అడిగినప్పుడు, వియన్నా ఒప్పందాన్ని భారత్ పూర్తిగా ఉల్లంఘించిందని, 40 మంది దౌత్యవేత్తలను వెళ్లగొట్టిందని అన్నారు. ''ఒక్కసారి మావైపు నుంచి ఆలోచించండి. కెనడా పౌరుడిని కెనడా గడ్డపై చంపడంపై భారత ఏజెంట్ల పాత్ర ఉందని నమ్మడానికి మావద్ద బలమైన కారణాలు ఉన్నాయి. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ మా దౌత్యవేత్తలను వెళ్లగొట్టింది. ప్రపంచదేశాలకు ఇది ఆందోళన కలిస్తోంది'' అని ట్రూడో వివరించారు. దౌత్యవేత్తలకు రక్షణ లేని పరిస్థితి ఉంటే అంతర్జాతీయ సంబంధాలు ప్రమాదంలో పడతాయని, ఇండియాతో నిర్మాణాత్మకంగా, సానుకూల దృక్పథంతో పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇదేదో తాము ఇప్పుడే చేస్తున్న పోరాటం కాదని, కెనడా చట్టబద్ధపాలన కోసం పనిచేసే దేశమని, దానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసారు.
Updated Date - 2023-11-12T17:38:40+05:30 IST