ఐఏఎస్, ఐపీఎస్కు జైలు
ABN, First Publish Date - 2023-05-05T03:17:28+05:30
ఐఏఎస్, ఐపీఎస్కు జైలుకృష్ణబాబు, ద్వారకా తిరుమలరావుకు శిక్ష మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకూ... 16లోగా రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలి ఆ వెంటనే వారిని జైలుకు తరలించాలి హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఆదేశాలు కోర్టు ధిక్కరణ కేసులో సంచలన తీర్పు
ఐఏఎస్, ఐపీఎస్కు జైలుకృష్ణబాబు, ద్వారకా తిరుమలరావుకు శిక్ష మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకూ... 16లోగా రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలి ఆ వెంటనే వారిని జైలుకు తరలించాలి హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఆదేశాలు కోర్టు ధిక్కరణ కేసులో సంచలన తీర్పు
ద్వారకా తిరుమలరావు కృష్ణబాబు
అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో ఓ ఐఏఎస్, ఓ ఐపీఎస్తోపాటు ముగ్గురు ఆర్టీసీ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ ప్రస్తుత వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ పూర్వ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతోపాటు తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి.చెంగలరెడ్డి, ఆర్టీసీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ యూఎస్ శ్రీనివాస్, నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.కోటేశ్వరరావుకు నెల రోజులు జైలుశిక్ష, రూ.1000 చొప్పున జరిమానా విధించింది. జరిమానా సొమ్ము చెల్లించడంలో విఫలమైతే మరో వారం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 16లోగా రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు లొంగిపోవాలని ఆ అధికారులను ఆదేశించింది. అనంతరం వీరిని జైలుకు పంపాలని రిజిస్ట్రార్కు స్పష్టం చేసింది. ‘‘న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సకాలంలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులదే. కోర్టు ఉత్తర్వుల అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ విషయాన్ని న్యాయస్థానానికి తెలిపి గడువు పొడిగింపు కోరాలి. ప్రస్తుత కేసులో అప్పీల్ పెండింగ్లో ఉందనే కారణం చూపారు తప్ప గడువు పొడిగించాలని అధికారులు కోరలేదు. అధికారుల తీరు కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనిపై ఈ నెల 2వ తేదీన తీర్పు ఇచ్చారు.
ఇదీ కేసు...
ఏపీఎ్సఆర్టీసీలో ఫీల్డ్మెన్గా పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన బి.సురేంద్ర, మరో ముగ్గురు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. తమకంటే జూనియర్ల సర్వీసును క్రమబద్ధీకరించారని తెలిపారు. ఈ వ్యాజ్యాలను విచారించిన న్యాయస్థానం జూనియర్ల సర్వీసును క్రమబద్ధీకరించిన విధంగానే పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని అధికారులకు స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణ తేదీ నుంచి జీతాలు లెక్కించి, 7శాతం వడ్డీ కలిపి పిటిషనర్లకు చెల్లించాలని పేర్కొంటూ 2022 ఆగస్టులో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు అమలుకాకపోవడంతో పిటిషనర్లు 2022 అక్టోబరులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎం.పిచ్చయ్య పేర్కొన్నారు. అధికారులకు కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించాలని అభ్యర్థించారు. అధికారుల తరఫున న్యాయవాది సాల్మన్రాజు వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేదన్నారు. అప్పీల్ పెండింగ్లో ఉండగా కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... అప్పీల్ దాఖలు చేశామని, ఉత్తర్వుల అమలుకు రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. ఈ వాదనలతో సింగిల్ జడ్జి విభేదించారు. స్టే ఉత్తర్వులు లేనప్పుడు కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణను కొనసాగించవచ్చన్నారు. అధికారుల వ్యవహారశైలి కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని స్పష్టంచేస్తూ వారికి నెలరోజుల సాధారణ జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు.
Updated Date - 2023-05-05T03:17:28+05:30 IST