Ganga devotion: గౌరమ్మ తెచ్చిన గంగమ్మ
ABN, Publish Date - Feb 26 , 2025 | 04:23 AM
మహాసంకల్పంతో పెరట్లో బావిని తవ్వి... మహాశివరాత్రినాడు అందులో పవిత్ర స్నానం ఆచరించేందుకు సిద్ధమయ్యారు యాభై ఏడేళ్ల కర్ణాటక మహిళ... గౌరీచంద్రశేఖర్. గంగమ్మను భువికి తెచ్చిన గౌరమ్మ కథ ఇది.
మహాకుంభ మేళాకు వెళ్లి గంగలో మునకేయాలనేది ఆమె కోరిక. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. కానీ... ఒంటరిగా శ్రమించి గంగమ్మనే తన ఇంటికి తెచ్చారు. మహాసంకల్పంతో పెరట్లో బావిని తవ్వి... మహాశివరాత్రినాడు అందులో పవిత్ర స్నానం ఆచరించేందుకు సిద్ధమయ్యారు యాభై ఏడేళ్ల కర్ణాటక మహిళ... గౌరీచంద్రశేఖర్. గంగమ్మను భువికి తెచ్చిన గౌరమ్మ కథ ఇది.
‘ప్రయాగరాజ్ మహాకుంభ మేళాకు వెళ్లాలంటే అదృష్టం ఉండాలి. నాకు అంతటి అదృష్టం లేదు. కారణం... నా ఆర్థిక పరిస్థితి. అందుకే ఆ గంగమ్మనే ఇక్కడకు తేవాలనుకున్నాను. దాని కోసం మా ఇంటి వెనుక భావి తవ్వాలని నిర్ణయించుకున్నాను’ అంటున్న గౌరీది కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా సిర్సీ గ్రామం. అక్కడ ఆమెకు చిన్నపాటి వ్యవసాయ క్షేత్రం ఉంది. దానిపై వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడమే కష్టమైపోవడంతో కొబ్బరి తోటలో కూలి పనికి వెళుతున్నారు. గౌరీకి మహాకుంభమేళ గురించి గత ఏడాది డిసెంబరులో తెలిసింది. ప్రయాగ్రాజ్కు వెళ్లి త్రివేణి సంగమంలో మునగాలని తొలుత భావించారు. అయితే ఖర్చుల లెక్కలు వేసుకొంటే అది తనవల్ల అయ్యే పని కాదని తెలిసి, ప్రయాణం విరమించుకున్నారు.
అలాగని అంతటితో వదిలేయలేదు. గంగ దగ్గరకు తను వెళ్లలేకపోవచ్చు. కానీ ఆ గంగనే తన ఇంటికి రప్పించి తన కోరిక నెరవేర్చుకోవాలని అనుకున్నారు. వెంటనే రంగంలోకి దిగారు. డిసెంబరు 15న బావి తవ్వడం ప్రారంభించారు. రోజుకు ఎనిమిది గంటల చొప్పున శ్రమించారు. తవ్వడం, తవ్విన మట్టిని బయటకు తోడేయడం... వేరొకరి సాయం లేకుండా అన్నీ తానే చేసుకున్నారు. రెండు నెలలు కష్టపడి... 40 అడుగుల లోతు వరకు తవ్వారు. చివరకు ఈ నెల 15న పని పూర్తి చేసి, భువి నుంచి గంగమ్మను పరవళ్లు తొక్కించారు.
‘మహాశివరాత్రి పర్వదినాన ఈ గంగలో పవిత్ర స్నానం చేస్తాను’ అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పారు గౌరీ. ఎవరి సాయం లేకుండా బావులు తవ్వడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. గతంలో మూడు బావులు తవ్వారు. ఒకటి సాగు కోసం... తన వ్యవసాయ క్షేత్రంలో. మరొకటి తన గ్రామంలో... ప్రజల దప్పిక తీర్చడానికి. మూడోది అంగన్వాడీ పాఠశాలలో... విద్యార్థుల కోసం.
ప్రతిఘటనలు తిప్పికొట్టి...
విద్యార్థులు, టీచర్ల కోసం అంగన్వాడీ స్కూల్లో బావి తవ్వే క్రమంలో ఆమెకు జిల్లా అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇక్కడ అందుకు అనుమతి లేదని, తక్షణమే పనులు ఆపేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. బావి తవ్వకం ప్రారంభ సమయంలో వచ్చి, గౌరీని అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి, ఆ తరువాత అభ్యంతరం వ్యక్తం చేశారు. తవ్వడానికి వీల్లేదని మాట మార్చారు. కానీ గౌరీ ఇవేవీ పట్టించుకోలేదు. నలుగురికీ ఉపయోగపడే ఒక మంచి పని కోసం వెనకడుగు వేసేది లేదని ఆమె తేల్చి చెప్పారు. అప్పటి స్థానిక
ఎంపీ అనంత్కుమార్ హెగ్డే మద్దతుతో 45 అడుగుల లోతు వరకు తవ్వి, బావి పూర్తి చేశారు. అందులో నీటి ఊట చూశాక తన మనసు ఆనందంతో ఉప్పొంగిందంటారు గౌరీ. సమాజం కోసం ఆమె చేస్తున్న అలుపెరుగని కృషికి ప్రజలు, ప్రభుత్వం, పలు సంస్థల నుంచి ఎన్నో ప్రశంసలు, అభినందనలు, గౌరవ సత్కారాలు అందుకున్నారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News
Updated Date - Feb 26 , 2025 | 04:23 AM