TS News: పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా రకరకాల మార్గాల్లో రవాణా
ABN, Publish Date - Feb 01 , 2024 | 03:21 AM
..ఇలాంటి వార్తలు పత్రికల్లో కనీసం రోజుకు ఒకటైనా చూస్తుంటాం! రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా దందాకు ఉదాహరణలివి! గంజాయి కట్టడికి పోలీసులు ఎంతగా ప్రయ
పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా రకరకాల మార్గాల్లో రవాణా
లిక్విడ్ గంజాయితో తినుబండారాలు.. ‘సోషల్’ ప్రచారం
డార్క్ నెట్లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న విద్యార్థులు
మత్తు కేసుల్లో పట్టుబడితే కఠినశిక్షలు.. భవిష్యత్తుకే దెబ్బ
ఉన్నత విద్య, విదేశీ, ప్రభుత్వ ఉద్యోగాలపై కేసుల ప్రభావం
పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా రకరకాల మార్గాల్లో రవాణా
లిక్విడ్ గంజాయితో తినుబండారాలు.. ‘సోషల్’ ప్రచారం
డార్క్ నెట్లో ఆర్డర్ ఇచ్చి
కొనుగోలు చేస్తున్న విద్యార్థులు
మత్తు కేసుల్లో పట్టుబడితే
కఠినశిక్షలు.. భవిష్యత్తుకే దెబ్బ
ఉన్నత విద్య, విదేశీ, ప్రభుత్వ ఉద్యోగాలపై కేసుల ప్రభావం
‘‘టమాటా ట్రేల మధ్యలో
గంజాయి ప్యాకెట్లు ఉంచి
అక్రమంగా రవాణా చేస్తున్న
ముఠా గుట్టు రట్టు’’
‘‘బొలేరో వాహనాల కింది
భాగంలో బాక్సుల్లాంటి నిర్మాణాలు ఏర్పాటు చేసి గంజాయి రవాణా’’
‘‘నర్సరీ మొక్కలను తరలించే వాహనాల్లో గంజాయి
తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు’’
..ఇలాంటి వార్తలు పత్రికల్లో కనీసం రోజుకు ఒకటైనా చూస్తుంటాం! రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా దందాకు ఉదాహరణలివి! గంజాయి కట్టడికి పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. అక్రమార్కులు రకరకాల కొత్త మార్గాలను కనిపెట్టి మరీ దాన్ని రవాణా చేస్తున్నారు. ఆ మత్తుకు బానిసైనవారు.. డార్క్నెట్లో ఆర్డరిచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఒక దశ దాటాక.. డబ్బు కోసం గంజాయి విక్రేతలుగా మారి పోలీసులకు దొరికిపోతున్నారు. అలా గంజాయి కేసుల్లో పట్టుబడితే.. వారి భవిష్యత్తు దెబ్బతింటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-హైదరాబాద్/సిటీ)
‘పుష్ప’ సినిమాలో ఎర్రచందనం రవాణాకు అల్లు అర్జున్ రకరకాల ప్లాన్లు వేస్తాడు గుర్తుందా? గంజాయి అక్రమ రవాణా అందుకు ఎంతమాత్రం తీసిపోదు. ఆ సినిమాలో అల్లు అర్జున్కు మించి కొత్తకొత్త మార్గాలను కనిపెట్టే గంజాయి ‘పుష్ప’లు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దమొత్తంలో గంజాయి మహారాష్ట్ర, కర్ణాటకలకు తెలంగాణ మీదుగానే రవాణా అవుతుంది. ఈ క్రమంలోనే గంజాయి విక్రేతలు ఇక్కడ కూడా తమ మార్కెట్ను విస్తృతంగా పెంచుకునేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ వ్యక్తులు కొరియర్లో పార్సిల్ పంపినట్టు పంపేవారు కొందరు. మరికొందరు ఎలాంటి భయమూ లేకుండా బస్సులు, రైళ్లల్లో సైతం తరలిస్తుంటారు. అయితే, పెద్ద మొత్తంలో తరలించాలంటే ఈ మార్గాలు సరిపోవు. అందుకోసం వాహనాల్లో ప్రత్యేకంగా క్యాబిన్లు తయారు చేయడం, ఇతర సరుకుల మధ్య ఉంచి సరఫరా చేయడం వంటి మార్గాలను ఎంచుకుంటారు. రైళ్లల్లో గంజాయి రవాణాకు ముఠాలు అమాయక మహిళలు, పిల్లలను సైతం వాడుకుంటాయి. ఇందులో భాగంగా.. డబ్బు ఆశ చూపి, రోజువారీ కూలీ పనులకు వెళ్లే మహిళలను ఎంచుకుంటారు. గంజాయిని ప్యాకెట్లలో చుట్టి, వాసన బయటకు రాకుండా నాఫ్తలిన్ గోలీలు ఉంచి వారికి అప్పగిస్తారు. ఆ ప్యాకెట్లో ఏం ఉందో వారికి ఏమాత్రం తెలియదు. ప్రయాణించే సమయంలో.. ఆ ప్యాకెట్లను ఒక బోగీలో ఉంచి వారిని మరో బోగీలో ఉండాల్సిందిగా సూచించి పంపిస్తారు. రవాణా ఖర్చులు, సెల్ఫోన్ వారికి ఇస్తారు. ఇచ్చిన సరుకును చెప్పినచోటుకు చేరవేస్తే.. వారికి ఇస్తామన్న డబ్బు ముట్టజెప్తారు. పోలీస్ నిఘా నుంచి తప్పించుకునేందుకు మహిళలతోపాటు చిన్నపిల్లల్ని కూడా పంపిస్తుంటారు. ఒక వేళ గంజాయితో వారు పట్టుబడితే.... వారిపైనే కేసులుంటాయి తప్ప, అసలు నిందితులు దొరకని విధానమిది. పోలీసులకు చిక్కకుండా.. చెక్పోస్టుల బెడద లేకుండా ఉండేందుకు ఓ గంజాయి విక్రేత కొరియర్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందుకోసం ఒక కొరియర్ సర్వీస్ నిర్వాహకునితో మాట్లాడుకుని సరఫరా చేయడం మొదలుపెట్టాడు. కానీ, ఇలాంటి విషయాలు ఆట్టే కాలం దాగవు. ఈ వ్యవహారంపై చందానగర్ పోలీసులకు సమాచారం అందడంతో గత ఏడాది ఆ కొరియర్ సంస్థపై దాడు చేసి 6 బాక్సుల్లో సరఫరా అయి వచ్చిన 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో గంజాయి విక్రేత అయితే.. పోలీస్ సైరన్, ప్రభుత్వాధికారుల స్టిక్కర్లను తన వాహనానికి అంటించి వాటిలో సరఫరా చేస్తూ దొరికిపోయాడు.
ద్రవరూప మహమ్మారి..
మామూలు గంజాయిని పెద్ద ఎత్తున రవాణా చేయడం, విక్రయించడం రిస్క్తో కూడుకున్న పని కావడంతో 2015 నుంచి గంజాయి ముఠాలు లిక్విడ్ గంజాయిపై దృష్టి సారించాయి. పొడి గంజాయి కంటే దీని ధర దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ, రవాణా సులభం, ఆదాయం ఎక్కువ. ధరతోపాటు.. అదిచ్చే కిక్కు కూడా ఎక్కువే. అందుకే.. హాషిష్ ఆయిల్గా పిలిచే ఈ ద్రవరూప గంజాయికి ఇప్పుడు మార్కెట్లో క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. మామూలు గంజాయి కంటే.. రెండు చుక్కల లిక్విడ్ గంజాయిని తీసుకోవడం వల్ల 10 రెట్ల ఎక్కువ కిక్ వస్తుండడంతో వినియోగదారులు.. రవాణా సులభం, ఆదాయం ఎక్కువగా ఉండడంతో విక్రేతలు దీనిపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారు ఈ లిక్విడ్ గంజాయిని తయారుచేయడంలో సిద్ధహస్తులు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు వారివద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ ఈ గంజాయిని తయారుచేస్తున్నారు. కొన్ని ప్రత్యేక రసాయనాలను, యంత్రాలను ఉపయోగించి తయారు చేసి గంజాయిని వారు ఆయిల్ రూపంలోకి మారుస్తారు. 30 కిలోల పొడిగంజాయి నుంచి ఒక లీటరు లిక్విడ్ తయారవుతుంది. దాన్ని 5 మిల్లీలీటర్ల (ఎంఎల్) బాటిళ్లలో నింపుకొంటే.. జేబుల్లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లిపోవడం చాలా సులభం. తనిఖీల్లో దొరికితే ఆయుర్వేద నూనె అని చెప్పి తప్పించుకుంటున్నారు. కొందరైతే అసలు తనిఖీల నుంచే తప్పించుకోవడానికి ఏకంగా ఆయుర్వేద మందు సీసాల్లో ఈ లిక్విడ్ను నింపి, ఆ పేరుతోనే రవాణా చేస్తున్నారు. 5ఎంఎల్ లిక్విడ్ గంజాయిని రూ.5 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
ప్రచారం ఇలా.. కొనుగోళ్లు అలా..
గంజాయి విక్రేతలు.. చిన్నచిన్న కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో సైతం ఆ మత్తు మహమ్మారి అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అమ్మకాల కోసం ప్రత్యేక చెయిన్లను ఏర్పాటు చేసుకుని హైదరాబాద్తోపాటు ఇతర జిల్లాల్లోనూ జోరుగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. చెయిన్ అంటే.. గంజాయికి పూర్తిగా బానిసలైనవారికి కమీషన్ల ఆశ చూపించి ఏజెంట్లుగా మార్చి, వారిద్వారానే అమ్మకాలు జరపడం. ఈ తరహా చెయిన్ సిస్టంలో విద్యార్థులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. చెయిన్ సిస్టమ్లో ఉన్న విద్యార్థులు.. తరచుగా పార్టీలు ఇస్తూ తొలుత తమ సర్కిల్లో ఉన్న వారిని మత్తువైపు లాగుతారు. తర్వాత వారికి విక్రయించి, వారిద్వారా మరికొందర్ని లాగుతారు. గంజాయి లిక్విడ్తో ఆకర్షణీయమైన తినుబండారాలు తయారు చేసి సోషల్ మీడియా వేదికగా వాటికి ప్రచారం కల్పించుకుంటున్నవారు కూడా ఉన్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో విద్యార్ధులు, యువత సులువుగా డార్క్నెట్లో ఆర్డర్ పెట్టి గంజాయిని తెప్పించుకుని వాడుతున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు.
రైళ్లల్లో రవాణాపై నిఘా: మహేశ్ భగవత్
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా గంజాయి పెద్ద ఎత్తున రవాణా అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కట్టడికి చర్యలు చేపడతామని అదనపు డీజీపీ (రోడ్డు భద్రత, రైల్వే) మహేశ్ భగవత్ తెలిపారు. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశామని... ఇకపై రైల్వే పార్సిళ్లపైనా దృష్టి సారిస్తామని ఆయన వెల్లడించారు. ఎవరిదగ్గరైనా 20 కిలోల కంటే ఎక్కువ మొత్తంలో గంజాయి పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని భగవత్ హెచ్చరించారు.
దొరికితే కష్టమే..
సరదా కోసం గంజాయి మత్తుకు అలవాటు పడితే ఆరోగ్యంపై ప్రభావం పడటంతోపాటు కేసుల విషయంలోను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. ఇతర కేసుల్లో అయితే న్యాయస్థానంలో వారి నేరం రుజువైతేనే నేరస్థులుగా పరిగణిస్తారుగానీ.. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల్ని ఉపయోగిస్తూ, రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడితే మొదటి రోజు నుంచే నేరస్థులుగా పరిగణిస్తారు. ఎన్డీపీఎస్ చట్టం అంత కఠినంగా ఉండటమే ఇందుకు కారణం. దాని ప్రకారం.. గంజాయి వినియోగిస్తూ పట్టుబడేవారిని ఒకటి, రెండుసార్లు బాధితులుగా గుర్తిస్తారు. వారు చికిత్సకు అంగీకరిస్తే.. కేసు నమోదు చేయకుండా ఎన్డీపీఎస్ యాక్ట్లోని సెక్షన్ 64ఏ కింద డీ-ఎడిక్షన్ సెంటర్కు తరలిస్తారు. అయినా గంజాయికి బానిసలై పదేపదే పట్టుబడే వారిని నిందితులుగా పరిగణించి కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. గంజాయి కేసుల్లో కనిష్ఠంగా 3, 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా మొదలుకొని జీవితఖైదు, మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇతర కేసుల్లో జీవిత ఖైదు, మరణ శిక్షలకు క్షమాభిక్ష కోరే అవకాశం చట్టప్రకారం ఉన్నా.. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నమోదయ్యే కేసుల్లో క్షమాభిక్షకు అవకాశం ఉండదని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. పెద్దమొత్తంలో గంజాయి సరఫరా చేస్తూ ఎక్కువసార్లు పట్టుబడేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారు.
పీడీ యాక్ట్ నమోదు అయిందంటే సగం జీవితం జైల్లో గడపాల్సిందే. గంజాయికి అలవాటు పడుతున్న వారిలో పాఠశాల విద్యార్థుల నుంచి, ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు ఉంటున్నారు. వారిని పోలీసులు గుర్తించినప్పుడు వారు చదివే విద్యాసంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులకు కూడా సమాచారం ఇస్తున్నారు. అలా సమాచారం ఇచ్చినా వారు అప్రమత్తమై గంజాయి వినియోగాన్ని అరికట్టే చర్యలు తీసుకోకపోతే.. దాన్ని నిర్లక్ష్యం కింద పరిగణించి వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. చదువుకునే దశలో మత్తుకు అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని.. క్రిమినల్ రికార్డు ఎంట్రీ కావడంతో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కోల్పోతారని, ఇక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Updated Date - Feb 01 , 2024 | 10:32 AM