దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
ABN, Publish Date - Dec 14 , 2024 | 12:30 AM
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లపై అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
వికారాబాద్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల కొరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని, దరఖాస్తులన్నింటినీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మునిసిపాలిటీల్లో వార్డు అధికారులు పరిశీలించాలని సూచించారు. సెక్రటరీలు, వార్డు ఆఫీసర్లు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని, ఇందిరమ్మ కమిటీలు సైతం కార్యదర్శులతో కలిసి పరిశీలించాలన్నారు. దరఖాస్తుదారు.. బీపీఎల్ కార్డు వర్గం, ప్రస్తుత నివాస గృహానికి సంబంధించిన పూర్తి వివరాలు, కులం, చిరునామాతో పాటు అన్ని వివరాలను సేకరించాలన్నారు. అదేవిధంగా ఇంటి వద్ద తీసుకున్న ఫొటో, ఇంటి పరిస్థితిపై లోపల, బయట ఫొటోలు, కొత్తగా నిర్మించుటకు తలపెట్టిన స్థలం, దానికి సంబంధించిన పూర్తి వివరాలను మొబైల్ యాప్లో అప్లోడ్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మునిసిపల్ కమిషనర్లు, వార్డు ఆఫీసర్లు, జీపీ కార్యదర్శులు, సర్వేయర్లు పాల్గొన్నారు.
Updated Date - Dec 14 , 2024 | 12:30 AM