అన్ని బడుల్లో మౌలిక సదుపాయాలు
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:26 PM
ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేందుకు మండల విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
షాద్నగర్, జనవరి 18 : ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేందుకు మండల విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని, వారికి మరింత నాణ్యమైన విద్యను అందించి మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నారు. బాల్య దశలోనే నిరుపేదలకు విద్య పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఎంఈఓలు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అప్పుడే వారు విద్య పట్ల ఆసక్తిని పెంపొందించుకుని ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ను కూడా జారీ చేయనుందని తెలిపారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నివేదికను శుక్రవారం అందజేయాలని ఎంఈవోలను ఎమ్మెల్యే ఆదేశించారు. మూత్రశాలలు, మరుగు దొడ్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 50 నుంచి 60 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి ఆయా పాఠశాలల్లోని సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలకు కేటాయించే అభివృద్ధి నిధుల్లో విద్యాభివృద్ధి కోసమే అధిక నిధులు కేటాయిస్తామని, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. షాద్నగర్, కొందుర్గు, కేశంపేట ఎంఈవోలు శంకర్ రాథోడ్, కిష్టారెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.
ఎయిర్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ సమావేశానికి ఎమ్మెల్యే
ప్రతిష్టాత్మకమైన ఎయిర్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు ప్రత్యేక ఆహ్వానం అందింది. గురువారం హైదరాబాద్ బేగంపేట విమానశ్రయంలో నిర్వహించిన వింగ్స్ ఇండియా-2024 ఎయిర్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అరుదైన అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jan 18 , 2024 | 11:26 PM