డైట్, కాస్మొటిక్ చార్జీలు 40శాతం పెంపు
ABN, Publish Date - Dec 12 , 2024 | 11:31 PM
సంక్షేమ గృహాలు, పాఠశాలలలో డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు
14వ తేదీన పండగ వాతావరణంలో కార్యక్రమం
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సంక్షేమ గృహాలు, పాఠశాలలలో డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జూమ్ మీటింగ్ ద్వారా ఈ విషయంపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిల్లలకు అందించే డైట్ చార్జీలను 40 శాతం పెంచిందని, డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈనెల 14న జిల్లాలోని 57 రెసిడెన్షియల్ పాఠశాలల్లో, 99 సంక్షేమ హాస్టల్స్లో పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు అధికారులు తగిన ఏర్పాట్లను ముందుగానే చేయాలని తెలిపారు. ఆర్డీవోలు, జిల్లా అధికారులు, పంచాయతీ అధికారులు, జిల్లా స్థాయి స్పెషల్ అధికారులు తమ పరిధిలోని సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని రకాల పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని తెలిపారు. హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల పరిసరాలను, తరగతి గదులను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా హాస్టల్ వార్డెన్స్, పాఠశాల ప్రిన్సిపల్స్ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తు ఆహ్వానాలు పంపాలని, విద్యాసంస్థ ఆవరణలో శానిటేషన్ చేయాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డైట్ చార్జీల పెంపు కార్యక్రమం జరగాలని, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరమైన భోజనం సిద్ధం చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రతీ హాస్టల్కి ఒక అధికారిని నియమించి పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా స్పెషల్ అధికారులు, ఎంపీడీవోలు, హాస్టల్ వార్డెన్స్, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 15, 16తేదీలలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రూట్ ఆఫీసర్లు, పోలీస్ నోడల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.
Updated Date - Dec 12 , 2024 | 11:31 PM