రాడార్ స్టేషన్.. వద్దే వద్దు
ABN, Publish Date - Jan 29 , 2024 | 03:58 AM
‘‘అడవులకు ఆలవాలం.. నదులకు నెలవు.. ఆహ్లాదకర వాతావరణానికి ఆవాసం.. అలాంటి వికారాబాద్ జిల్లాలో వేల చెట్లను నరికి నేవీ రాడార్ స్టేషన్ను తీసుకొస్తారా..
12 వేల టవర్లతో అంతులేని రేడియేషన్
ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూడాలి
ప్రధాని, కేటీఆర్ను కలిసి విన్నవిస్తాం
వికారాబాద్ చర్చా వేదికలో వక్తలు
వికారాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘అడవులకు ఆలవాలం.. నదులకు నెలవు.. ఆహ్లాదకర వాతావరణానికి ఆవాసం.. అలాంటి వికారాబాద్ జిల్లాలో వేల చెట్లను నరికి నేవీ రాడార్ స్టేషన్ను తీసుకొస్తారా..? అభివృద్ధి పేరుతో అడవిని పూర్తిగా నాశనం చేస్తారా..? ప్రాణాలైనా ఇస్తాం కానీ.. ఈ విధ్వంసాన్ని అడ్డుకుని తీరతాం’’ అని దామగుండం పరిరక్షణ సమితి సభ్యులు తేల్చిచెప్పారు. దామగుండంలో నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటును నిరసిస్తూ వికారాబాద్లో ఆదివారం చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ పారె్స్టను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడంపై మండిపడ్డారు. రాడార్ స్టేషన్ను ఏర్పాటుతో ఈ ప్రాంతంలో సుమారు 12వేల టవర్లు వస్తాయని.. దీని ద్వారా స్థానికులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఈ ప్రాంతంలో పంటలు పండే పరిస్థితి ఉండదని, పిల్లలు పుట్టే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. 1989లో అమెరికాలో నేవీ రాడర్ కోసం ఏర్పాట్లు చేశారని.. దాంతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడ్డారని గుర్తుచేశారు. చాలా మందికి క్యాన్సర్ వచ్చిందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని.. అవసరమైతే శాటిలైట్ ద్వారా సిగ్నళ్లను తెప్పించుకోవాలన్నారు. ఇక్కడ ఉన్న చెట్లు ఎలాంటివో అధ్యయనం చేయకుండా నరికివేతకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. అడవిలోని వనమూలికల చెట్లకు పేటెంట్ హక్కు కల్పిస్తే.. అవే రూ.లక్షల కోట్ల ఆదాయం సమకూరుస్తాయని అన్నారు. 2015-16 సమయంలో నేవీ అధికారులు ఇక్కడ 36 లక్షల మొక్కలు నాటి పెంచుతున్నట్లు చెబుతున్నారని.. ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా నాటలేదని వెల్లడించారు.
అడ్డుకుని తీరుతాం..
అందరి సహకారతో రాడార్ కేంద్రం రాకుండా ఆపుతామని వక్తలు స్పష్టం చేశారు. సోమవారం పరిగికి వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వినతిపత్రం ఇవ్వడంతో పాటు త్వరలో వికారాబాద్ రాబోతున్న ప్రధాని మోదీని కలిసి సమస్యలను విన్నవించాలని తీర్మానించారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోందని.. సమస్య పరిష్కారం కాకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డికి రాడార్ కేంద్రంపై ఎందుకు అంత శ్రద్ధ ఉందో అర్థం కావడంలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తీరును ఖండించారు. అవసరమైతే జిల్లాలో రోడ్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే జిల్లాలో ఒక రోజు బంద్కు పిలుపునిస్తామని చెప్పారు.
Updated Date - Jan 29 , 2024 | 03:58 AM