దాహం.. దాహం..
ABN, Publish Date - Mar 13 , 2024 | 11:14 PM
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా ఆప్గ్రేడ్ అయినట్లు ఇటీవలే జీవో జారీ అయ్యింది.
- జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రమైన తాగునీటి కొరత
- పని చేయని వాటర్ ప్లాంట్లు
- ఇబ్బంది పడ్తున్న రోగులు, వారి బంధువులు
- మిషన్ భగీరథ ద్వారా నీరందించాలని వినతి
గద్వాల న్యూటౌన్, మార్చి 13 : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా ఆప్గ్రేడ్ అయినట్లు ఇటీవలే జీవో జారీ అయ్యింది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మంచినీటి కొరతతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో కూర్చునేందుకు షెడ్లు లేకపోవడంతో రోగుల వెంట వచ్చే సహాయకులు, కుటుంబసభ్యులకు నిలువ నీడ కరువయ్యింది.
ఇంటి నుంచే తాగునీరు
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కొరత ఏర్పడ టంతో చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకులు ఇంటి నుంచే ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. లేదా హోటళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. కొందరు దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి ప్రతీ రోజు 700 నుంచి 800 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. ప్రతీ సోమవారం దాదాపు 1200 మంది వస్తూ ఉంటారు. అలాగే 300 నుంచి 400 మంది దాకా ఇన్పేషంట్స్గా చికిత్స పొందుతున్నారు. తాగునీరు అందుబాటులో లేక వారందరూ తీవ్ర ఇబ్బంది పడ్తున్నారు. ఆసుపత్రిలో రెండు వాటర్ ప్లాంట్లు ఉన్నా అవి పని చేయడం లేదు. ఆసుపత్రికి మిషన్ భగీరఽథ నుంచి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు మునిసిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా, ఫలితం లేకపోయింది. నిబంధనల మేరకు మునిసిపాలిటీ పరిధిలోని కాలనీలకు మాత్రమే తాగునీరు సరఫరా చేస్తామని వారు చెప్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో నీడ లేక ఇబ్బంది పడుతున్నామని, షెడ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నీళ్ల బాటిళ్లు కొనుగోలు చేసి తెచ్చుకున్నాం
ఖలీల్, గద్వాల : మా కుమార్తె కాన్పు కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం. తాగునీరు అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేక బయట కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. ఇలా ప్రతీ రోజు కొనాలంటే మాకు ఇబ్బంది. ఆసుపత్రిలో నీటి కొరత తీర్చాలి.
ఇంటి నుంచి నీరు తెచ్చుకున్నాం
ఏసుదాసు, చిన్నతాండ్రపాండు : మా పిల్లవాడికి జ్వరం వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, వైద్యులు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ ఇక్కడ తాగేందుకు నీరు లేదు. దీంతో ఇంటి నుంచే తెచ్చుకుంటున్నాం. తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను
గ్రౌండ్ వాటర్ అడుగంటిపోవడంతో నీటికష్టాలు ఎక్కువయ్యాయి. ఎండాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే రానురాను సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించేలా చూడాలని విన్నవించాను. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు.
- డాక్టర్ కిశోర్కుమార్, సూపరింటెండెంట్
Updated Date - Mar 13 , 2024 | 11:14 PM