ఆయిల్ పామ్ సాగు టార్గెట్ను పూర్తి చేయాలి
ABN, Publish Date - Sep 21 , 2024 | 10:45 PM
జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని, నిర్ధేశించిన టార్గెట్ లక్ష్యానికి చేరుకోవాలని కలెక్టర్ బీఎం.సంతోష్ సూచించారు.
- రైతులకు అవగాహన కల్పించి, విస్తీర్ణం పెంచండి
- సమీక్షా సమావేశంలో కలెక్టర్ బీఎం.సంతోష్
గద్వాల, సెప్టెంబరు 21 : జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని, నిర్ధేశించిన టార్గెట్ లక్ష్యానికి చేరుకోవాలని కలెక్టర్ బీఎం.సంతోష్ సూచించారు. ఇందుకోసం రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సాగు వైపు అడుగులు వేసేవిధంగా చూడాలని ఆదేశించారు. శనివారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఉద్యానవన, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పదివేల ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటివరకు ఆరు వేల ఎకరాల్లో సాగు అయ్యిందని మిగిలిన నాలుగు వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేవిధంగా చూడాలని అన్నారు. ఇందుకోసం రైతులకు అవగాహన కల్పించాలని ఇందులో ఆయిల్ పామ్ సాగుకు, ఇతర పంటల సాగుకు ఉన్న తేడా, లాభాలు, కూలీల వ్యధలు వంటి వాటివి వివరించాలన్నారు. అదేవిధంగా ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని వివరించాలని అన్నారు. ఇప్పటికే సాగు చేసిన రైతుల అనుభవాలను వారితో పంచుకునే విధంగా వారితో ఒక సమావేశం నిర్వహించాలని సూచించారు. సాగు పెంచితేనే జిల్లాలో ఆయిల్మిల్లు ఏర్పాటు అవుతుందని, దానివలన మార్కెట్ కష్టాలు తప్పుతాయని వివరించారు. రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా అందించే సేవలను వివరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్బాష, వ్యవసాయ అధికారి సక్రియానాయక్, ఎల్డీఎం అయ్యపురెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 10:45 PM