లక్ష్యంపై దృష్టి సారించాలి
ABN, First Publish Date - 2024-02-06T23:06:26+05:30
జీవిత లక్ష్యంపై విద్యార్థులు దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు.
- ఎస్పీ యోగేష్ గౌతమ్
నారాయణపేట, ఫిబ్రవరి 6 : జీవిత లక్ష్యంపై విద్యార్థులు దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. మంగళవారం నారాయణపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పోలీస్ కళా బృందం, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పాల్గొని, మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా గోల్ను ఏర్పాటు చేసుకొని అందుకగుణంగా ముందుకు సాగాలని, లక్ష్యాన్ని చేరుకునేందుకు వచ్చే ఇక్కట్లను అధిగమిస్తూ ముందుకెళ్లాలన్నారు. ప్రతీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ టీమ్స్, ప్రతీ స్కూల్లో ఫిర్యాదు బాక్కులను ఏర్పాటు చేశామని, ఎలాంటి ఫిర్యాదులనైనా బాక్సులో వేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామ న్నారు. కళాశాల, పాఠశాలలకు వచ్చిపోయే సమయంలో ఆకతాయిలు వేధిస్తే వెంటనే డయల్ 100 లేదా జిల్లా షీ టీంకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ బాలికలను కోరారు. ప్రజలు, రద్దీ ప్రాంతాల్లో పోలీస్ మఫ్టీలో తిరుగుతుంటారని మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడే చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆన్లైన్ మోసాలు, బ్యాంకు సేవలు, రుణాలు, యాప్స్ వాట్సాప్, ట్విట్టర్ తదితర వాటితో అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వారితో ఛాటింగ్ చేయొద్దని, విద్యార్థులు చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో సమయం గడిపి విలువైన సమయం వృథా చేయకుండా కేరీర్పై దృష్టి సారించాలన్నారు. బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్పీ విద్యార్థులకు సూచించారు. అంతకుముందు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఐటీయూసీ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎస్పీ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ రంగారెడ్డి, పోలీస్ కళా బృందం సురేందర్, శేఖర్, లింగన్న, కల్యాణి, షీ టీం పోలీసులు శ్రీదేవి, బాల్రాజ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న, శ్రీనివాస్, వెంకటేష్, రాజీరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2024-02-06T23:06:27+05:30 IST