Pranahita Project: ప్రాణహితకు భూములు ఎలా?
ABN, Publish Date - Jan 18 , 2024 | 05:16 AM
ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన మంచిర్యాల జిల్లాలోని 71 ఎకరాల భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ఆయిల్పామ్ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టింది.
మందమర్రిలో 71 ఎకరాలు ఆయిల్పామ్ కంపెనీకి అప్పగించిన గత ప్రభుత్వం
రూ.10.66 కోట్లకు ఒప్పందమైనా నగదు చెల్లించని ‘మ్యాట్రిక్స్’ కంపెనీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహితపై దృష్టిసారించడంతో గందరగోళం
మంచిర్యాల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన మంచిర్యాల జిల్లాలోని 71 ఎకరాల భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ఆయిల్పామ్ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టింది. ఒప్పందం ప్రకారం ఆ పరిశ్రమ ఇప్పటికీ భూములకు నగదును చెల్లించలేదు. పరిశ్రమనూ ఏర్పాటు చేయాలేదు. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును కాదని, కాళేశ్వరం వైపు మొగ్గు చూపింది. దీంతో ప్రాణహిత ప్రాజెక్టు కాల్వలు, పైపులైన్లు, పంప్హౌ్సల నిర్మాణం కోసం సేకరించిన భూములు నిరుపయోగంగా మారాయి. వాటిలో కొన్ని భూములను తిరిగి రైతులు సాగు చేసుకుంటుండగా, మరికొన్నింటిని గత ప్రభుత్వం ఇతర పనులకు కేటాయించింది. మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అయిల్పామ్ సాగును ప్రోత్సహించిన బీఆర్ఎస్ సర్కారు.. మందమర్రి మండలం శంకర్పల్లి వద్ద పామాయిల్ పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేసింది. పరిశ్రమ బాధ్యతను హైదరాబాద్కు చెందిన మ్యాట్రిక్స్ కంపెనీకి అప్పగించింది. సారంగపల్లి శివారులోని సర్వే నెంబర్లు 95, 97, 112, 113, 119లో మొత్తం 71.05 ఎకరాలను కేటాయించింది. ఆ భూములకు మార్కెట్ విలువ రూ.10.66 కోట్ల మేర ధరను నిర్ణయిస్తూ గత ఏడాది జనవరి 2న సీసీఎల్ఏ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుకు చెందిన ఆ భూములను ఇరిగేషన్శాఖ నుంచి రెవెన్యూశాఖకు బదిలీ చేసి మరీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్రిక్స్ కంపెనీకి అప్పగించింది. ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నగదు చెల్లించకుండానే మ్యాట్రిక్స్ కంపెనీ ఆ భూములను చేజిక్కించుకుంది. అవే భూముల్లో పామాయిల్ కంపెనీ ఏర్పాటుకు అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భూముల నగదు చెల్లించాలంటూ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఫిబ్రవరి 27న మ్యాట్రిక్స్ సీఈవోకు లేఖ రాసినప్పటికీ గత ప్రభుత్వ పెద్దల అండదండలతో కంపెనీ ప్రతినిధులు డబ్బులు చెల్లించలేదు.
శంకుస్థాపనకే పరిమితం..
మందమర్రి మండలంలో రూ.500 కోట్లతో పామాయిల్ మినీ రిఫైనరీ పూర్తిచేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని ప్రకటించిన కంపెనీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి దొరుకుతుందని శంకుస్థాపన సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన కూడా అమలు కాలేదు. జిల్లాలో 2020లో ప్రయోగాత్మకంగా ఆయిల్పామ్ సాగును ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం 2,800 పైచిలుకు ఎకరాలకు విస్తరించింది. గత ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమైనప్పటికీ మినీ రిఫైనరీ పనులు మొదలు పెట్టకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం, ప్రాణహిత ప్రాజెక్టుపై దృష్టి సారించడంతో భూముల అంశం తిరిగి తెరపైకి వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయిల్పామ్ రిఫైనరీకి అక్రమంగా అప్పగించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Updated Date - Jan 18 , 2024 | 07:20 AM