కాంగ్రెస్ దిగ్గజనేత పొద్దుటూరి నర్సారెడ్డి ఇకలేరు
ABN, Publish Date - Jan 30 , 2024 | 03:51 AM
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి (93) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా
అనారోగ్య సమస్యలతో కన్నుమూత
నిర్మల్, హైదరాబాద్, బంజారాహిల్స్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి (93) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్చించోలి గ్రామం నర్సారెడ్డి స్వస్థలం. 1931 సెప్టెంబరు 22న జన్మించారు. ఓయూ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. కొన్నాళ్లు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. స్వాతంత్ర సమరంలో, నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రె్సలో చేరారు. మూడుసార్లు నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా.. ఒకసారి ఆదిలాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1973 నుంచి 1978 వరకు నీటి పారుదల, రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగారు. నర్సారెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నిర్మల్ జిల్లాలో స్వర్ణ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గ్రామ అవసరాలకు తన సొంత భూమిని కూడా దానం చేశారు. 1981 నుంచి 1985 సంవత్సరం వరకు ఏపీ శాసనమండలి సభ్యుడిగా పని చేశారు. ఇదే సమయంలో ఆయన ఆసెంబ్లీ, శాసన మండలి పార్లమెంట్కు సంబంధించిన పలు కీలక కమిటీల్లో సభ్యుడిగా కొనసాగారు.
నర్సారెడ్డి మృతి పట్ల మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జు, ఏలేటీ మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. నర్సారెడ్డి మరణవార్త తెలియడంతో సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు. నర్సారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని, ఆయన అనుభవాలు తమకు మార్గదర్శకంగా ఉండేవని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ప్రజలకు మరువలేని సేవలందించారని వ్యాఖ్యానించారు. సీఎంతో పాటు మంత్రి సీతక్క, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు తదితరులు.. పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. నర్సారెడ్డి మృతిపట్ల మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, పొన్నం, జూపల్లి సంతాపం వ్యక్తం చేశారు. కాగా మధ్యాహ్నానికి నర్సారెడ్డి పార్థివదేహాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం గాంధీభవన్కు తరలించారు. అక్కడ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కోదండరెడ్డి, నాగయ్య, కుమార్రావు, కమలాకర్ తదితరులు, పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం జూబ్లిహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
Updated Date - Jan 30 , 2024 | 03:51 AM