Kumaram Bheem Asifabad: మానవీయ దృక్పథంతో చూడాలి
ABN, Publish Date - Jan 14 , 2024 | 10:33 PM
వాంకిడి, జనవరి 14: పాలకులు, సమాజం పులులకు ఇచ్చే విలువను మనుషులకు ఇవ్వకపోవడం మాని మానవీయ దృక్పథంతో విషయాన్ని చూడాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధానకార్యదర్శి ఎస్ తిరుపతయ్య అన్నారు.
-ఆదివాసీల అరెస్టుపై మానవ హక్కుల వేదిక సభ్యులు
వాంకిడి, జనవరి 14: పాలకులు, సమాజం పులులకు ఇచ్చే విలువను మనుషులకు ఇవ్వకపోవడం మాని మానవీయ దృక్పథంతో విషయాన్ని చూడాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధానకార్యదర్శి ఎస్ తిరుపతయ్య అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం దరిగాంలో ఈనెల 6, 8 తేదీల్లో మరణించిన రెండు పెద్ద పులల విషయంలో వాంకిడి మండలం రింగారెట్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా పులులు చంపినట్లు నేరం మోపి వారిని రిమాండ్కు పంపిన కేసులో ఆదివారం వారు నిజనిర్ధారణ జరిపారు. అనంతరం వాంకిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాంకిడి మండలం రింగారెట్, చెరుకుపల్లి, దరిగాం గ్రామాల నుంచి ఆదివాసీ ప్రజల పశువులు ఆహారం కోసం దరిగాం అటవీకి వెళ్తాయి. ఈ నేపథ్యంలో రింగారెట్ గ్రామానికి చెందిన కోవ గంగు ఆవు నెలరోజుల క్రితం దరిగాం అడవిలో తప్పిపోయింది. ఆవు తిరిగి వస్తుందేమోనన్న ఆశతో దాని యజమాని అటవీ అధికారులకు తెలియజేయలేదు. కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరిధిలోకి వచ్చే దరిగాం అడవిలో పులి చనిపోయిందనే సమాచారం గ్రామస్థులు ఇస్తే తప్ప అటవీ అధికారులకు తెలియలేదు. తదనంతరం వారు పులులు చనిపోవడానికి పరిసర ప్రాంతాల రైతులు లేదా పశువుల కాపరులే కారణమై ఉంటారని అనుమానంతో సిడాం రాము అనే 12 సంవత్సరాల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని చేత కోవ గంగు, ఆత్రం జలపతులే పులుల మరణానికి కారణమని చెప్పించారు. కోవ గంగును, ఆత్రం జలపతితోపాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. కేవలం దెబ్బలకు తట్టుకోలేక మాత్రమే తాము చేయని నేరాన్ని ఒప్పుకుంటున్నామని గంగు, జలపతులు చెప్పారని వారి బంధువులు మాకు తెలియజేశారు. కోర్టులో నేరం రుజువైనా, కాకపోయినా పులుల మరణాలకు గల కారణాలను, అడవుల్లో ఆదివాసీల పరిస్థితిని మానవీయ కోణంతో పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. అడవులు పులులకే కాదు ఆదివాసులకు కూడా మాతృస్థలాలని అడవుల్లో ఈ రోజు పులులకే కాదు ఆదివాసులకు, వారి పశుసంపదకు కూడా రక్షణ లేదన్నారు. గత సంవత్సరం సిడాం భీము అనే పత్తి రైతుపై పులి దాడిచేసి చంపేసింది. నెల రెండు నెలలకొక ఆవు లేదా ఎద్దు, ఇంకా గొర్రెలు, మేకలు పులుల బారిన పడి చనిపోతున్నాయి. పులుల బారినపడి చనిపోయే గొర్రెలు,మేకలకు పరిహారం ఇచ్చే వెసులుబాటు చట్టంలో లేదట.. కానీ మనుషులు, ఎద్దులకు మాత్రం ప్రభుత్వం, అటవీ అధికారులు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పులులు చనిపోతే మాత్రం ఆదివాసీ ప్రజలను జైళ్లకు పంపుతున్నారు. పాలకులు, సమాజం పులులకు ఇచ్చే విలువను మనుషులకు ఇవ్వకపోవడం మాని మానవీయ దృక్పథంతో విషయాన్ని చూడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అఽధ్యక్షుడు కాంబ్లీ అతీష్, సభ్యులు ఆత్రం సాయుధ, నూతన్, మరప సురేష్ ఉన్నారు.
Updated Date - Jan 14 , 2024 | 10:33 PM